సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ): కరోనా మూడో దశ వ్యాప్తిని నియంత్రించేందుకు తలపెట్టిన ఇంటింటి జ్వర సర్వే శుక్రవారం నగరంలో ప్రారంభమైంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న జీహెచ్ఎంసీ ప్రాంతంలో 1440 బృందాలు ప్రతిరోజూ ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహిస్తున్నాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలున్న వారిని గుర్తించి వారి పేర్లు నమోదు చేసుకుని అవసరమైన మందులు ఇస్తున్నారు. తీవ్ర లక్షణాలున్న వారిని గాంధీ, టిమ్స్ వంటి తదితర కొవిడ్ కేంద్రాలకు పంపిస్తున్నారు. టీకా తీసుకోని వారికి దగ్గర్లో ఉన్న కేంద్రంలో టీకాలిప్పిస్తున్నారు. వృద్ధులు, గర్భవతులకు ఇంటి వద్దనే పరీక్షలు చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో మాత్రం సెకండ్ వేవ్లో ప్రారంభించిన జ్వర సర్వే ఇంకా నిరంతరాయంగా కొనసాగుతున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.వెంకటి తెలిపారు. రెండో దశలో నిర్వహించిన జ్వర సర్వే మంచి ఫలితాలు ఇవ్వడంతో థర్డ్వేవ్కు అడ్డుకట్ట వేసే క్రమంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మరోసారి సర్వే నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు.
1440 బృందాలతో..
నగర పరిధిలో 1440 బృందాలతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో హైదరాబాద్ జిల్లా పరిధిలో 840 బృందాలతో, గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి జిల్లాలో 272 బృందాలు, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 328బృందాలు శుక్రవారం నుంచి జ్వర సర్వే ప్రారంభించినట్లు తెలిపారు. ఒక్కో బృందం 60 ఇండ్లు లక్ష్యంగా.. అన్ని బృందాలు కలిసి ప్రతి రోజూ 86 వేలకు పైగా ఇండ్లల్లో సర్వే చేస్తారని వివరించారు. ప్రతి బృందంలో ఇక ఆశా వర్కర్తో పాటు ఒక జీహెచ్ఎంసీ సిబ్బంది ఉంటారు. కాగా ఖైరతాబాద్లో శుక్రవారం ప్రారంభమైన ఇంటింటి జ్వర సర్వేను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశీలించారు.
తొలిరోజు 35,107 ఇండ్లలో సర్వే
నగరంలో మొదటి రోజు 35107 ఇండ్లను బృందాలు సందర్శించినట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి వెల్లడించారు. ఇందులో 1192 మందికి లక్షణాలున్నట్లు గుర్తించి వారికి ఐసొలేషన్ కిట్లను పంపిణీ చేశామన్నారు. 224 మంది కరోనా రోగులను పర్యవేక్షించడంతో పాటు 59మంది అనుమానిత లక్షణాలున్న వారిని ఆయా దవాఖానలకు సిఫారసు చేసినట్లు వివరించారు. సర్వేలో భాగంగా 1,944 మంది 15-18 ఏండ్ల వారికి, 2,128 మంది 18 ఏండ్లు పైబడిన వారికి మొదటి డోసు, 4,477 మందికి సెకండ్ డోస్ టీకా, 548 మందికి ప్రికాషనరీ డోస్ వేయించినట్లు ఆయన తెలిపారు.
మేడ్చల్ జిల్లాలో 60వేల ఇళ్లలో
మేడ్చల్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 852 వైద్య బృందాలు శుక్రవారం మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్పల్లి, ఉప్పల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలలోని 60,489 ఇళ్లలో సర్వే చేసి 1983 మందికి కొవిడ్ లక్షణాలను గుర్తించారు. 1,895 మందికి హోం ఐసొలేషన్ కిట్లను అందజేశారు. అత్యవసర సేవలకు 15 ప్రత్యేక అంబులెన్స్లను అందుబాటులో ఉంచినట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లాలో..
గ్రామీణ ప్రాంతాల్లో 558 బృందాలు, అర్భన్లో 120 బృందాలతో తొలిరోజు సర్వే నిర్వహించారు. మొత్తం 10,500 ఇండ్లలో సర్వే నిర్వహించినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ స్వరాజ్య లక్ష్మి తెలిపారు.
జ్వర సర్వేకు సహకరించండి
ప్రభుత్వం ప్రారంభించిన ఇంటింటి జ్వర సర్వేకు జిల్లా ప్రజలందరూ సహకరించాలని హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ అన్నారు. ఈ మేరకు గురువారం సికింద్రాబాద్, కంటోన్మెంట్, రసూల్పురా, ఈస్ట్మారేడుపల్లిలోని సంజీవయ్య నగర్, వీకర్ సెక్షన్ కాలనీలలో జరుగుతున్న ఇంటింటి జ్వర సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఆయా ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను వారి ఇండ్లలో ఎవరికైనా కరోనా లక్షణాలు అంటే జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారిని కలిసి స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోండి:ఫీవర్ సర్వేను ప్రారంభించినమేయర్ విజయలక్ష్మి
జ్వరం, జలుబు తదితర లక్షణాలు ఉంటే వెంటనే కొవిడ్ పరీక్షలు చేసుకోవడంతో పాటు జాగ్రత్తలు తీసుకుంటూ హోం ఐసొలేషన్లో ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఎన్బీటీనగర్లో శుక్రవారం జ్వర సర్వేను ఆమె ప్రారంభించారు. వైద్య సిబ్బంది, జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లారు. ఎవరికైనా జ్వర లక్షణాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఇంట్లో ఎవరికైనా జ్వరం ఉంటే అక్కడికక్కడే పరీక్షలు చేయించడంతో పాటు హోం ఐసొలేషన్ కిట్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు ప్రారంభమైన జ్వరసర్వేలో వైద్యశాఖ సిబ్బందితో పాటు జీహెచ్ఎంసీకి చెందిన వివిధ విభాగాల సిబ్బంది పాల్గొంటున్నారని తెలిపారు. కొవిడ్ టెస్టులకు నిర్దేశించిన ధరకంటే అధికంగా వసూలు చేసే ప్రైవేటు దవాఖానలపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీహెచ్వో డాక్టర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.