సిటీబ్యూరో, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ) : నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గడిచిన రెండు రోజుల్లో 10కి చేరింది. ఈ నెల 20న 6 కేసులు నమోదు కాగా, తాజాగా గురువారం మరో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ముందస్తు చర్యలు ప్రారంభించారు. నగర పరిధిలోని అన్ని యూపీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా దవాఖానలతోపాటు ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, ఎర్రగడ్డ చాతి దవాఖాన వంటి టీచింగ్ హాస్పిటళ్లలోనూ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వైద్యాధికారులు వెల్లడించారు. గాంధీ, కోరంటి, ఎర్రగడ్డ చాతి దవాఖాన, కింగ్కోఠి జిల్లా దవాఖానతోపాటు కొండాపూర్, వనస్థలిపురం, మల్కాజిగిరి దవాఖానల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. అన్ని బస్తీ దవాఖానలు, ఇతర ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోనూ ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కరోనా లక్షణాలున్నట్లు అనుమానం ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.