బన్సీలాల్పేట్, మార్చి 27 : పోషణ పక్షోత్సవాలలో భాగంగా పద్మారావునగర్లోని హమాలీ బస్తీ అంగన్వాడి కేంద్రాన్ని సోమవారం మహిళా,శిశు సంక్షేమ శాఖ అధికారులు సందర్శించారు. రాష్ట్ర స్థాయి పోషణ్ అభియాన్, జాయింట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జేఎన్.గిరిజ, కన్సల్టెంట్ ఎస్.ప్రశాంతి, హర్టీకల్చర్ ఏడీ.జయరాజ్, పోషణ్ అభియాన్, హైదరాబాద్ జిల్లా కోఆర్డినేటర్ భరత్, సికింద్రాబాద్ ప్రాజెక్ట్ సీడీపీఓ సునంద, సూపర్వైజర్ జహ్నవి మాట్లాడుతూ మంచి ఆరోగ్యానికి, ప్రకృతి పరంగా లభించే అధిక పోషక విలువలు కలిగిన సిరిధాన్యాలు (మిల్లెట్స్) ఎంతో మేలు చేస్తాయని, షుగర్, బీపీ, ఊబకాయం లాంటివి రాకుండా కాపాడుతాయని చెప్పారు. మార్కెట్లో దొరికే నిత్యావసర వస్తువుల కన్నా మిల్లెట్స్ను ఎక్కువగా ఆహారంలో తీసుకోవాలని వారు సూచించారు.
ఈ సందర్భంగా ‘వెల్ బేబీ షో’ నిర్వహించారు. సిరిధాన్యాలతో తయారుచేసిన ఉగ్గుతో చిన్నారులకు అన్నప్రసన నిర్వహించారు. తల్లిదండ్రులకు నిర్వహించిన వంటల పోటీలో మిల్లెట్స్తో తయారుచేసిన ఆహార పదార్థాలను ఎగ్జ్జిబిషన్లో ప్రదర్శించారు. కిశోర బాలికలకు పోషకాహారం గురించి వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఉత్తమంగా నిలిచిన విజేతలకు మిల్లెట్స్ను బహుమతిగా అందించారు. బస్తీ దవాఖాన మెడికల్ అధికారి డాక్టర్ రాజ్కుమార్ మాట్లాడుతూ పోషకాహారం తీసుకోవడం తల్లులకు, పిల్లలకు ఎంతో అవసరమని వివరించారు.