సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): హోండా యాక్టివా స్కూటర్ కొనుగోలుదారుకు రూ.30,924 రీఫండ్ చేయాలని ఇండస్ ఇండ్ బ్యాంక్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. దీంతోపాటు నోటీసులివ్వకుండా వినియోగదారు నుంచి వాహనం లాక్కోవడం నిబంధనలకు విరుద్ధమని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సి.లక్ష్మీప్రసన్న, శాసనకోట మాధవిలతో కూడిన బెంచ్ పేర్కొన్నది. సంస్థ ఏజెంట్లు మానసికంగా ఇబ్బందులకు గురిచేసినందుకు వినియోగదారుకు రూ.20వేలు నష్టపరిహారం, కోర్టు ఖర్చుల కింద రూ.10వేలు చెల్లించాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. ఎస్ఆర్ నగర్కు చెందిన అనితాలక్ష్మి కానిశెట్టి 2017లో హోండా యాక్టివా స్కూటర్ను కొనుగోలు చేసింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ నుంచి రూ.48,500కు ఫైనాన్స్ చేయించారు. ప్రతినెల ఈఎంఐ తన బ్యాంకు ఖాతా ద్వారా రూ. 2,557 లెక్కన క్రమం తప్పకుండా నవంబర్ 2018 వరకు.. 36 నెలలు చెల్లించారు. ఆర్థిక ఇబ్బందులు ఉండగా.. ఒకనెల ఈఎంఐ చెల్లించలేదు. ఫిర్యాదుదారు భర్త యాక్టివాను నడుపుతుండగా బ్యాంక్కు చెందిన నలుగురు ఏజెంట్లు రోడ్డుపై అడ్డుకొని ఎలాంటి నోటీసులు లేదా సమాచారం ఇవ్వకుండానే బలవంతంగా వాహనాన్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. దీంతో ఫిర్యాదుదారు భర్త వెంటనే బ్యాంకు మేనేజర్ను సంప్రదించి వాహనాన్ని విడుదల చేయాలని అభ్యర్థించారు.
10 రోజుల్లోపు బకాయి మొత్తంతోపాటు రూ.5వేలు అదనంగా చెల్లిస్తేనే వాహనాన్ని విడుదల చేస్తామని, లేదంటే వాహనాన్ని వేలం వేస్తామని బెదిరించారని వివరించారు. దీంతో వాయిదాలను చెల్లిస్తానని, పలుమార్లు విన్నవించినా వారు పట్టించుకోలేదని వాపోయారు. ఆ తర్వాత వాహనం వేలం వేసి రూ.45వేలకు విక్రయించారు. దీంతో, కొనుగోలుదారు న్యాయం కోసం వినియోగదారుల కమిషన్ను సంప్రదించి అభ్యర్థించారు. అనేక సార్లు కొనుగోలుదారుకు నోటీసులు పంపించామని, అయినా స్పందించలేదని, అందువల్లే వాహనం వేలం వేయక తప్పలేదని సదరు బ్యాంక్ ప్రతినిధులు వాదించారు. కేసు పూర్వాపరాలు కమిషన్ బెంచ్ పరిశీలించిన అనంతరం బ్యాంకు వాదనల్లో అర్థం లేదని, నిబంధనల ప్రకారం కొనుగోలుదారు చెల్లించిన రూ.30,924లు రీఫండ్ చేయాలని, అంతేగాకుండా, మానసికంగా ఇబ్బందులకు గురిచేసినందుకు రూ.20వేలు నష్టపరిహారం, కోర్టు ఖర్చుల కింద రూ.10వేలు చెల్లించాలని ఇండస్ ఇండ్ బ్యాంకును ఆదేశించింది. ఉత్తర్వులు అందిన 45 రోజుల్లో ఆదేశాలను అమలు చేయాలని బెంచ్ సూచించింది.