సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ఓ ఖాతాదారుడికి డెబిట్ కార్డు జారీ చేయకుండానే, అతడి అకౌంట్ నుంచి చార్జిల కింద రూ.590 యాక్సిస్ బ్యాంక్ వసూలు చేసింది. తార్నాకలోని హనుమాన్నగర్కు చెందిన కెవిన్ సుకీర్తి యాక్సిస్ బ్యాంకులో సేవింగ్ ఖాతాను రూ.25 వేలతో తెరిచారు. అనంతరం రూ.లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అయితే డెబిట్ కార్డుతోపాటు చెక్బుక్స్ అందజేయాలని ఖాతాదారుడు కోరగా ఇంటికి పంపిస్తామని బ్యాంకు అధికారులు తెలిపారు.
రోజులు గడిచినా అవి అందకపోవడంతో అధికారులను అడిగినా సరైన సమాధానం రాలేదు. కొన్నాళ్లు గడిచిన తర్వాత ఖాతాదారుడి ఫోన్కు రూ.590లు డెబిట్ కార్డు సేవల పేరుతో ఖాతా నుంచి డిడక్ట్ అయినట్లు సందేశం వచ్చింది. దీంతో వినియోగదారుడు బ్యాంకు అధికారులను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1ను ఆశ్రయించారు. కేసును కమిషన్ అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సి.లక్ష్మీప్రసన్న, ఆర్.నారాయణరెడ్డిలతో కూడిన బెంచ్ పరిశీలించింది. నిబంధనల ప్రకారం డెబిట్ కార్డు ద్వారా ఎలాంటి సేవలు పొందని ఖాతాదారుడి నుంచి చార్జీలు ఎట్లా వసూలు చేస్తారని ప్రశ్నించింది. రూ.25వేలకు 9శాతం వడ్డీ కలిపి చెల్లించాలని, ఖాతాదారుడిని ఇబ్బందులకు గురిచేసినందుకు రూ.5వేలు జరిమానా విధించడంతోపాటు రూ.2వేలు కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది.