సిటీబ్యూరో, ఏప్రిల్ 4 ( నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణ రంగం దూసుకెళ్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఆకాశ హర్మ్యాలు, భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 2022-23 ఆర్థిక సంవత్సరంలో నిర్మాణ రంగ అనుమతుల ద్వారా 16,329 అనుమతులు పొందాయి. ఇందులో 13,771 బిల్డింగ్ పర్మిషన్లు ఉండగా..2581 ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను జీహెచ్ఎంసీ జారీ చేసింది. మొత్తంగా నిర్మాణ రంగ అనుమతుల ద్వారా రూ.1454.76 కోట్ల ఆదాయం సమకూర్చుకున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మాత్రం రూ.1144.08 కోట్ల ఆదాయం రాగా…గతంలో కంటే రూ.310.68కోట్ల అధిక ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతున్న తరుణంలో ప్రభుత్వ ప్రోత్సాహకాలతో నిర్మాణ రంగం గణనీయంగా వృద్ధి పథంలోకి దూసుకెళ్తున్నదని, మంత్రి కేటీఆర్ మార్గదర్శకంలో రియల్ రంగం ప్రగతి సాధించిందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. టీఎస్ బీ పాస్ ద్వారా నిర్మాణ రంగ అనుమతులు సులభతరం అయ్యాయని పేర్కొన్నారు.
గ్రేటర్లో ఆకాశ హర్మ్యాల జోరు కొనసాగుతున్నది. ఒక్క ఏడాదిలోనే 97 హైరైజ్డ్ నిర్మాణాలకు అనుమతులు లభించాయి. 40, 53 అంతస్తుల రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు సంబంధించి నాలుగు చోట్ల అనుమతులు మంజూరు చేశారు. 10 అంతస్తుల నుంచి 40 అంతస్తుల మధ్య గల హైరైజ్డ్ బిల్డింగ్లుగా గుర్తిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో భవన నిర్మాణ అత్యధిక ఎత్తు గరిష్ఠంగా 50 అంతస్తులుగా నిర్ణయించారు. దాని ఎత్తు మీటర్లలో అయితే 165 మీటర్లుగా ఉంటుంది. ఇక కమర్షియల్ ప్రాజెక్టులకు సంబంధించి 7 చోట్ల భవనాలకు అనుమతులిచ్చారు. ఇందులో 10 అంతస్తుల కంటే ఎక్కువగా ఉండగా, ఇందులో ఒకటి మాత్రమే 40 అంతస్తులతో కమర్షియల్ నిర్మాణంగా ఉంది.