సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయడంతోనే ఈ ఏడాది సంచలనాత్మకమైన కేసులను గంటల వ్యవధిలోనే ఛేదించామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ అన్నారు. తప్పు చేసిన నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో రాష్ట్రంలోనే రాచకొండ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. శనివారం ఆయన కమిషనర్ హోదాలో 7వ సారి రాచకొండ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదికను నాగోల్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఆయన పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి.
భరోసా కల్పిస్తున్న ‘డయల్ 100’
మహిళలకు భద్రత
మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టిసారించామని సీపీ మహేశ్భగవత్ తెలిపారు. మహిళలపై వేధింపులతో పాటు బాల్య వివాహాలు, బాల కార్మికులకు విముక్తి చేస్తున్నట్లు వివరించారు. ఇతర రాష్ర్టాల పిల్లలకు ప్రత్యేకంగా పాఠశాలలు నిర్వహిస్తున్నామని, దీనికి స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. మహిళల వేధింపులపై షీ టీమ్స్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయని చెప్పారు. షీ టీమ్స్కు పట్టుబడిన వారిలో చాలా మందికి వారి ప్రవర్తన, ఆలోచన తీరులో మార్పు తేవడానికి మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 29 బాల్య వివాహలను ఆపింది. 4200 డెకాయి ఆపరేషన్లు, 7200 మెట్రో డెకాయి ఆపరేషన్లు, 1800 అవగాహన కార్యక్రమాలు షీ టీమ్స్ నిర్వహించిందన్నారు. మాదక ద్రవ్యాలను కూకటి వేళ్లతో అణిచివేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగానే భారీ స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ చేయడంతో అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయని చెప్పారు. డ్రగ్స్ విక్రయించే వారితో పాటు డ్రగ్స్ వాడే వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నామన్నారు. డ్రగ్స్ వినియోగదారులలో మార్పు తెచ్చేందుకు ప్రత్యేకంగా వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నామని తెలిపారు.
వచ్చే ఏడాది కొత్త పోలీస్స్టేషన్లు
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా పోలీస్స్టేషన్లు, డివిజన్లు, జోన్లు రానున్నాయని సీపీ మహేశ్భగవత్ తెలిపారు. 763 కొత్త పోస్టులను ప్రభుత్వ మంజూరు చేసిందని చెప్పారు. ఇందులో భాగంగా కొత్తగా మహేశ్వరం జోన్ ఏర్పాటవుతుందన్నారు. చర్లపల్లి, నాగోల్, హైదరాబాద్ గ్రీన్ ఫార్మ సిటీ పీఎస్, పోచారం ఐటీ కారిడార్, ఉప్పల్లో మహిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటువుతున్నాయని తెలిపారు. అలాగే ఘట్కేసర్, జవహర్నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ ఠాణాలతో పాటు రెండు ట్రాఫిక్ జోన్లు, రెండు ఎస్ఓటీ జోన్లు ఏర్పాటవుతున్నాయని పేర్కొన్నారు. మేడిపల్లి పరిధిలో రాచకొండ కమిషనరేట్కు నూతన భవనం ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని సీపీ వివరించారు. డ్రగ్స్ రహిత ప్రాంతంగా కమిషనరేట్ను తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దర్యాప్తులో మరింత వేగం, టెక్నాలజీని ఉపయోగించి నిందితులకు మరింత శిక్షల శాతం పెరిగేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. నూతన సంవత్సర వేడుకలను డ్రగ్స్ లేకుండా నిర్వహించుకోవాలని, ఎక్కడైనా ఏదైనా డ్రగ్ వాడినట్లు, నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు, డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సీపీ సూచించారు. ఈ సమావేశంలో డీసీపీలు సన్ప్రీత్సింగ్, శ్రీబాల, యాదగిరి, ఎం.వెంకటేశ్వర్లు, సలీమా, డి.శ్రీనివాస్, కె.మురళీధర్, అదనపు డీసీపీలు సి.నర్మద, ఎం.శ్రీనివాసులు, ఎ.లక్ష్మిలతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, రాచకొండ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధులు వెంకటేశ్, గగన్దీప్ కోహ్లీ, రాచకొండ పోలీస్ కమిషనరేట్కు చెందిన ఇన్స్పెక్టర్పై స్థాయి అధికారులు పాల్గొన్నారు.