తెలంగాణ ఫర్ పీస్ అండ్ యూనిటీ ర్యాలీలో పలువురు వక్తలు
కవాడిగూడ, ఏప్రిల్ 24 : ప్రజాస్వామ్య పునరుద్ధరణ, రాజ్యాంగ స్ఫూర్తి, నైతికతను కాపాడుకోవడానికి, నిరంకుశత్వం, మత దురాభిమానికి వ్యతిరేకంగా పౌర సమాజం తమ గళాన్ని విప్పాల్సిన అవసరం ఉన్నదని పలువురు వక్తలు అన్నారు. ఆదివారం తెలంగాణ ఫర్ పీస్ అండ్ యూనిటీ ఆధ్వర్యంలో పలు ప్రజా సంఘాల నేతలు బషీర్బాగ్ చౌరస్తాలోని బాబూ జగ్జీవన్రామ్ విగ్రహం నుంచి పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మేము శాంతి కోసం ఐక్యంగా ఉన్నాం, మత విద్వేశాలకు నో చెప్పండి, మానవత్వమే మా అందరి మతం అంటూ పోస్టర్ల ద్వారా సందేశాన్ని ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రొఫెసర్లు, ప్రజా సంఘాల నేతలు రమా మెల్కోటే, పద్మజాషా, పీఓడబ్ల్యూ సంధ్య, అమూమత్ సొసైటీ ప్రతినిధి ఖలీదా పర్వీన్, తెలంగాణ ఉమెన్ అండ్ ట్రాన్స్ జెండర్ జేఏసీ ప్రతినిధి కె.సజయ, మజన్ హుస్సేన్(కోవా), విద్యావేత్త తబస్సుమ్, సారా మాథ్యూ, విస్సా కిరణ్, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ప్రతినిధి మీరా సంఘమిత్ర, తెలంగాణ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధి సిస్టర్ లిజీ, సిస్టర్ రోసీ, పీఓడబ్ల్యూ ఝాన్సీ. ఎంఏ షకిల్, మోర్తాల విమల, కృష్ణకుమారి, జాహీద్ ఖాద్రీ, ఆకునూరి మురళి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని మతాల ప్రజల మధ్య శాంతి, ఐక్యతను నెలకొల్పడానికే ఈ ర్యాలీని నిర్వహించినట్లు వారు వెల్లడించారు.