సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): సులభంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ఏపీకి చెందిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ఉన్న ఉద్యోగాలకు సెలవు పెట్టి.. గంజాయి వ్యాపారం చేస్తూ సైబరాబాద్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. బాచుపల్లి ఇన్స్పెక్టర్ జె. ఉపేందర్ రావు కథనం ప్రకారం.. ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన ఊరుటి సాగర్ పట్నాయక్ (32) కాకినాడలోని ఏపీఎస్పీ 3వ బెటాలియన్లో హెడ్ కానిస్టేబుల్. తూర్పు గోదావరికి చెందిన పప్పల శ్రీనివాస్ (35) కూడా అదే బెటాలియన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఒకే బెటాలియన్లో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న సాగర్, శ్రీనివాస్ ఉద్యోగంతో పాటు స్థానికంగా లభించే జీడి పప్పు (కాజు) వ్యాపారం కూడా చేస్తుంటారు. అయితే, ఈ వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవడంతో గంజాయి విక్రయిస్తూ అధిక లాభాలు పొందాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు తమకు ఆరోగ్యం బాగాలేదంటూ ఉద్యోగాలకు సెలవు పెట్టారు. అనంతరం స్థానికంగా గంజాయి కొనుగోలుచేసి, ఎవరికీ అనుమానం రాకుండా కాజు ప్యాకెట్ల నడుమ ప్యాక్ చేశారు. గురువారం రాత్రి ఏపీ నుంచి మారుతీ కారులో గంజాయిని హైదరాబాద్ తరలించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు ప్రగతినగర్ కమాన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ.. అటుగా వచ్చిన ఏపీ కానిస్టేబుళ్ల కారును ఆపి తనిఖీ చేశారు. ఆ కారులో 11 ప్యాకెట్లలో 22 కిలోల గంజాయి లభించింది. దీంతో వారిద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 22 కిలోల గంజాయితో పాటు కారు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ ఉపేందర్రావు తెలిపారు.