చాంద్రాయణగుట్ట/చార్మినార్, జూన్ 25: కుటుంబంలో జరుగుతున్న గొడవలకు తన తోడల్లుడే కారణమని కక్ష్యపెంచుకున్న ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి హత్యకు ప్లాన్ వేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఫలక్నుమా పోలీసులు ఆ ముగ్గురు నిందితులతో పాటు మరో బాలుడిని అదుపులోకి తీసుకొని కుట్రను భగ్నం చేశారు. ఫలక్నుమాలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య వివరాలు వెల్లడించారు. ఫారూఖ్నగర్కు చెందిన మీర్ అష్ఫాక్ అలీ అలియాస్ అమీర్ఖాన్ (27) వ్యాపారి. అష్ఫాక్ అలీ తోడల్లుడు నజీమ్. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. నజీమ్ భార్య ఇంటిలో క్షుద్రపూజలు చేస్తుందనే ప్రచారం కూడా ఉంది. ఈ మధ్య కాలంలో మీర్ అష్ఫాక్ అలీ ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. సంతానం కూడా కలగడంలేదు. కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యంతో ఉంటున్నారు. వీటన్నింటికీ నజీం చేస్తున్న క్షుద్రపూజలే కారణమని కోపం పెంచుకున్నాడు. నజీంను హత్య చేస్తే కుటుంబం క్షేమంగా ఉంటుందని అష్ఫాక్ అలీ భావించాడు. ఇందుకు తన స్నేహితులైన మహ్మద్ సుభాన్ఖాన్(19), మహ్మద్ జమీల్ఖాన్(19), ఇమ్రాన్, ఫర్హాన్, చోట ఫర్హాన్, మైనర్తో కలిసి హత్యకు ప్లాన్ వేశాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఫలక్నుమా ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర బృందం హత్యకు కుట్ర పన్నిన అష్ఫాక్ అలీతో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరో బాలుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించారు. కుట్రలో భాగమై పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. నాందేడ్లో కొనుగోలు చేసిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఫలక్నుమా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమావేశంలో ఏసీపీ షేక్ జహంగీర్తోపాటు ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్ఐలు నాగరాజ్, రవికుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.