శ్రీషిర్డీసాయి బృందావన్ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు
హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 ఆదేశం
సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): శ్రీషిర్డీసాయి బృందావన్ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ బ్రోచర్లో పేర్కొన్న విధంగా వెంచర్లో వసతులు కల్పించడంలేదని, అంతేగాకుండా లేఅవుట్కు అనుమతిలేదని, తాను చెల్లించిన డబ్బులు తిరిగి ఇప్పించాలని ఖైరతాబాద్లోని ఆనంద్నగర్ కాలనీకి చెందిన మారం శ్రీనివాసరావు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1ను ఆశ్రయించారు. గుంటూరు జిల్లాలోని కంతేరు గ్రామంలో ఏర్పాటు చేసిన ‘సాయి రేషిక పారడైస్’ ఫేజ్-2 వెంచర్లో రెండు ప్లాట్లను కొనుగోలు చేశాడు. 2019లో శ్రీషిర్డీసాయి బృందావన్ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం ప్రకారం సేల్డీడ్ కింద రూ.7,15,000 చెల్లించాడు. మిగతా మొత్తం రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సి ఉంది. అయితే క్రెడా నిబంధనల ప్రకారం అమ్మకపు ఒప్పంద తేదీ నుంచి ఏడాదిలోపు ప్లాట్లను ఇవ్వాల్సి ఉంది. అయితే, ఒప్పందం ప్రకారం కొనుగోలుదారుడికి ప్లాట్లు అప్పగించలేదు.
పలుమార్లు సంస్థ యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. దీంతో బాధితుడు కమిషన్-1ను ఆశ్రయించాడు. ధ్రువీకరణ పత్రాలు, కేసు పూర్వపరాలు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమా వెంకట సుబ్బలక్ష్మి, సభ్యురాలు సి.లక్ష్మీప్రసన్నతో కూడిన బెంచ్ పరిశీలించింది. సంస్థ వ్యాపార నిబంధనలకు తిలోదకాలిస్తున్నట్లు స్పష్టమైందని తెలిపింది. బాధితుడికి రూ.7.15లక్షలు రీఫండ్ చేయడంతోపాటు 24 శాతం వడ్డీ, రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని శ్రీషిర్డీసాయి బృందావన్ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అంతేగాకుండా రూ.10వేలు ఖర్చుల కింద చెల్లించాలని పేర్కొన్నది.