భాగ్యనగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైంది. గమ్యాన్ని చేరేందుకు వాహనదారులు నరకం చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఎల్బీస్టేడియంలో గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బూత్ లెవల్ మీటింగ్ నగరవాసుల సహనాన్ని పరీక్షించింది. గమ్యాన్ని చేరుకునేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
Hyderabad Traffic | సిటీబ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ): నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రధాన రహదారుల్లో సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఇలా నగర రోడ్లపై నిత్యం నరకయాతన పడుతున్న ప్రజలకు గురువారం ఎల్బీస్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బూత్ లెవల్ మీటింగ్ మరింత ఇబ్బందులను తెచ్చిపెట్టింది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్తో నానా అవస్థలుపడాల్సి వచ్చింది. ఈ సమావేశంతో స్టేడియానికి సుమారు రెండు కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం 5.40 నిమిషాల సమయంలో మీటింగ్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగంతో ముగిసింది. అనంతరం సీఎం రేవంత్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వారంతా స్టేడియం నుంచి బయటకు వచ్చారు.
అప్పుటికే పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపుతో ఎక్కడికక్కడ రద్దీ ఏర్పడి.. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, అదే సమయంలో స్టేడియం నుంచి వచ్చిన వారితో ఆ పరిసర ప్రాంతాలు నిండిపోయాయి. దీంతో సాయంత్రం వేళ.. ఇంటికి వెళ్లేవారు ట్రాఫిక్లో చిక్కుకొని గోసపడ్డారు. ఇదిలా ఉంటే తెలుగుతల్లి ఫ్లైఓవర్పై రాత్రి 7.30 సమయంలో కారు దగ్ధమైంది. ఈ ఘటనతో అప్పటికే ట్రాఫిక్ జామ్లో చిక్కుకొని అవస్థలు పడుతున్న వారు మరింత అసహనానికి గురయ్యారు. గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోయి.. రాత్రి 8 నుంచి 9 గంటల సమయానికి ఇంటికి చేరుకున్నారు. కాగా, గత పదేండ్లలో ఎల్బీ స్టేడియంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన సభలు, సమావేశాలు అత్యసరమైతే తప్ప.. అనుమతులు ఇవ్వలేదు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు నగర ప్రజల ఇబ్బందులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.