సిటీబ్యూరో, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ): ప్రజలకు నమ్మకం కలిగేలా టౌన్ ప్లానింగ్ శాఖ అధికారుల పనితీరు ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం 7వ అంతస్తు మీటింగ్ హాల్లో టౌన్ ప్లానింగ్ శాఖ అధికారులతో ఆయా అంశాలపై కమిషనర్ రొనాల్డ్ రాస్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. బిల్డింగ్ పర్మిషన్లకు సంబంధించి టీఎస్ బీ పాస్లో ఏ దరఖాస్తును అయినా 21 రోజుల్లోగా పరిష్కరించాలని రొనాల్డ్ రాస్ తెలిపారు.
నిర్ణీత కాల వ్యవధిలో టౌన్ప్లానింగ్ అధికారులు నిబంధనల మేరకు అర్హత గల దరఖాస్తులను క్లియర్ చేయడం, లేదా వాటిని రిజెక్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. గ్రీవెన్స్లో ఆన్లైన్, ఆఫ్లైన్లో వచ్చిన అన్ని దరఖాస్తులను పరిష్కరించడంపై దృష్టి సారించాలని చెప్పారు. గ్రీవెన్స్ లాగిన్లో ఉన్న పెండెన్సీ దరఖాస్తులన్నీ వారంలోగా క్లియర్ చేయాలని ఆదేశించారు. కోర్టు కేసుల విషయంలో అశ్రద్ధ వహించొద్దని, టై బాండ్ కేసులలో వెంటనే చర్యలు చేపట్టాలని, జోన్, సర్కిల్ వారీగా పెండింగ్ కేసులకు సంబంధించి కౌంటర్ వేయాలని సూచించారు.
మాన్సూన్ యాక్షన్ ప్లాన్లో భాగంగా శిథిలావస్థలో ఉన్న గృహాలను గుర్తించి ఎలాంటి నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. జంక్షన్ ఇంఫ్రూవ్మెంట్ ప్లాన్స్ సిద్ధం చేయాలని, మైనర్, మేజర్ జంక్షన్కు సంబంధించి తమ తమ సర్కిల్లో ఇబ్బందులను గుర్తించి ఎలాంటి ఆస్తులకు నష్టం జరగకుండా జంక్షన్ అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో గల నీటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఎలాంటి ఆక్రమణలు, నిర్మాణాలు జరగరాదని తెలిపారు.
లేక్స్ ప్రొటెక్షన్ వాట్సాప్ గ్రూప్లలో టౌన్ప్లానింగ్ వారిని చేర్చాలని సంబంధిత అధికారులకు సూచించారు. న్యాక్ ఇంజినీర్లు అనుమతులు లేని నిర్మాణాలను గుర్తించాలని, సుమోటోగా, ఫిర్యాదులకు సంబంధించిన వాటిపై వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో చీఫ్ సిటీ ప్లానర్ రాజేంద్రప్రసాద్ నాయక్, అడిషనల్ సీసీపీలు గంగాధర్, సీపీలు, ఏసీపీలు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.