సిటీబ్యూరో, సెప్టెంబరు 6 (నమస్తే తెలంగాణ ) : సైఫాబాద్లోని ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ ఎల్ శర్మన్ సోమవారం సందర్శించారు. పాఠశాలలో విద్యార్థుల హాజరుతో పాటు తరగతి గదులను పరిశీలించి, శానిటైజేషన్ చేశారా? లేదా?అని తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు కరోనా జాగ్రత్తలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకోవాలని, చేతులను శానిటైజ్ చేసుకోవాలని చెప్పారు. పాఠశాలలకు రాని మిగతా స్నేహితులను కూడా రమ్మని చెప్పాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటుకోవాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అర్చన, ఇతర ఉపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి, ఫాతిమా పాల్గొన్నారు.