మేడ్చల్ జోన్ బృందం, డిసెంబరు 29 : మేడ్చల్ నియోజకవర్గంలో ప్రజా పరిపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం కొనసాగింది. రెండో రోజూ దరఖాస్తులు వెల్లువెత్తాయి. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అధికారులకు దరఖాస్తులు సమర్పించారు. కాగా ప్రతి మండలంలో రెండు గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించగా, మున్సిపాలిటీల్లో అన్ని వార్డుల్లో ప్రజల దరఖాస్తులను స్వీకరించారు.
నియోజకవర్గంలోని ఐదు మండలాలు, 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లలో కలిపి మొత్తం 43,081 దరఖాస్తులు వచ్చాయి. మేడ్చల్ పట్టణంలోని 7, 23 వార్డుల్లో, మండలంలోని గౌడవెల్లి గ్రామంలో ప్రజా పాలన దరఖాస్తుల కేంద్రాలను జిల్లా కలెక్టర్ గౌతమ్, అడిషనల్ కలెక్టర్ అగస్త్యతో కలిసి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అర్హులందరికీ ఆరు గ్యారంటీలను అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
రీసోర్స్ పర్సన్లు, సిబ్బంది అందజేసిన దరఖాస్తులను ప్రజలంతా పూరించి, కౌంటర్లలో
అందజేయాలన్నారు. అయితే దరఖాస్తులకు ప్రజలు ఆధార్, రేషన్ కార్డులు జత చేస్తున్నారా? లేదా? అని కలెక్టర్ పరిశీలించారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన సూచనలు ఇవ్వాలని, ప్రజలకు ఇబ్బంది కల్గకుండా చూడాలని అధికారులకు సూచించారు. అవసరమైతే మరో కౌంటర్ ఏర్పాటు చేయాలన్నారు. సంబంధిత ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట జడ్పీ సీఈఓ దేవసహాయం, డీపీఓ రమణమూర్తి, అధికారులు, సిబ్బంది ఉన్నారు.
బోడుప్పల్ పరిధిలోని 33 కేంద్రాల్లో ఆరు గ్యారంటీల పథకాల దరఖాస్తులను స్వీకరించారు. మేడ్చల్ మండలంలోని గౌడవెల్లి, పూడూర్ గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎంపీడీవో పద్మావతి, తాసీల్దార్ శైలజ పర్యవేక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్లు బాబు యాదవ్, సురేందర్ ముదిరాజ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్, డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్రెడ్డి, ఏవో అర్చన, డీటీ దిలీప్ పాల్గొన్నారు. అదే
విదంగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ రాములు పర్యవేక్షణలో ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించారు.
జవహర్నగర్లో మేయర్ మేకల కావ్య, కమిషనర్ రామలింగం ప్రజా పాలన కేంద్రాలను పరిశీలించారు. 6వ డివిజన్లో జరిగిన కార్యక్రమాన్ని కార్పొరేటర్ పల్లవు రవి పర్యవేక్షించారు. కీసర మండలం గోధుమకుంట, అంకిరెడ్డిపల్లి గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించారు.
మూడుచింతలపల్లి మండలం జగ్గంగూడ గ్రామంలో నిర్వహిస్తున్న దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని జడ్పీ చైర్మన్ పరిశీలించారు. శామీర్పేట మండలం మురహార్పల్లి లో తాసీల్దార్ సత్యనారాయణ ఆధ్వర్యంలో, బాబాగూడలో ఎంపీడీవో వాణి ఆధ్వర్యంలో, మూడుచింతలపల్లి మండలం నాగిశెట్టిపల్లిలో ఎంపీడీవో వత్సలాదేవి ఆధ్వర్యంలో దరఖాస్తులను స్వీకరించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు శుక్రవారం అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీల్లోని అన్ని వార్డుల్లో సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులను తీసుకున్నారు. ఆయా మున్సిపాలిటీ కమిషనర్లు ఎండీ సాబేర్అలీ, వేమనరెడ్డి దరఖాస్తు స్వీకరణ కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.