హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో చలి తీవ్రత పెరిగింది. చల్లని గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నగరంలో చాలా చోట్ల 15 డిగ్రీల సెల్సియస్, అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు తెలిపారు. ఉదయం పొగ మంచు కురుస్తుండటంతో.. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గత కొన్ని రోజుల నుంచి సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. నవంబర్ నెలలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 19.3 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇక గురువారం రోజు 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ వెచ్చని దుస్తులు ధరించాలని సూచించారు. వృద్ధులు, చిన్న పిల్లలను బయటకు పంపించొద్దని సూచించారు.
గడిచిన 24 గంటల్లో మల్కాజ్గిరిలో 13.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు, రాజేంద్రనగర్లో 13.7 డిగ్రీల సెల్సియస్, సికింద్రాబాద్లో 14.4 డిగ్రీల సెల్సియస్, సరూర్ నగర్లో 14.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్-మల్కాజ్గిరి, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా గురువారం చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాల్లో రాబోయే మూడు, నాలుగు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్కు చేరుకునే అవకాశం ఉంది.