– చామకూర మల్లారెడ్డి
కీసర, మార్చి 16 : పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరాగా నిలుస్తున్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసర మండల కేంద్రానికి చెందిన బలిజె సుశీలకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ. 60వేల చెక్కును బుధవారం మంత్రి మల్లారెడ్డి ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదల కుటుంబాలకు ఎంతగానో అండగా నిలుస్తున్నదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాతనే బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వ పరంగా అన్ని పథకాలు అందుతున్నాయని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకున్న వారికి ప్రభుత్వం వారి ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సాయం అందిస్తున్నదని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలలోని వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రతి పథకం నిరుపేదలకు అందుతున్నదని, తెలంగాణ ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని మంత్రి చెప్పారు. గ్రామా ల్లో ఉన్న సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతి సభ్యులందరూ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, పార్టీ మండల అధ్యక్షుడు జలాల్పురం సుధాకర్రెడ్డి, టీఆర్ఎస్ నేతలు నాయకపు వెంకటేశ్ ముదిరాజ్, మండల కో-ఆప్షన్ సభ్యుడు బషారత్ ఆలీ, గ్రామ శాఖ అధ్యక్షుడు చినింగని బాల్రాజ్, ఉపాధ్యక్షుడు సుమన్బన్నీ, వివిధ గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.