మియాపూర్ : నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేయిస్తున్నారు . ఇప్పటికే వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు ప్రాజెక్టులు నిర్మించి రైతుల కండ్లలో ఆనందాన్ని నింపారని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు.
ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న యువత నిరాశచెందకుండా ఇప్పటికే 1.25 లక్షల ఉద్యోగాల కల్పనను విజయవంతంగా పూర్తి చేసిన సీఎం కేసీఆర్ తాజాగా….90 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు, తక్షణ ప్రకటన జారీ చేస్తున్నట్లు శాసనసభ సాక్షిగా ప్రకటించారన్నారు. ఈ ఉద్యోగాల ప్రకటన ద్వారా యువత కలలు నెరవేరుతాయి.
టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాబోయే భవిష్యత్ యావత్తు యువతదేనని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు యువతను మభ్యపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ వారి మాటలను ఎవరూ విశ్వసించలేదు. ప్రభుత్వం పేర్కొన్నట్లుగా ఉద్యోగాల భర్తికి ప్రకటనను విడుదల చేసి తన మాట నిలబెట్టుకున్నదన్నారు.
రాష్ట్ర అభివృద్ధితో పాటు బంగారు తెలంగాణ నిర్మాణానికి పటిష్టమైన విజన్తో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులు నెలకొన్నా అథికమించి పురోగతిలో తెలంగాణ దేశంలో అగ్రభాగాన నిలవటం సీఎం కేసీఆర్ సమర్థ పాలనకు నిదర్శనం అని ఆరెకాపూడి గాంధీ అభిప్రాయపడ్డారు.