మేడ్చల్, సెప్టెంబర్16 (నమస్తే తెలంగాణ): 8 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కండ్లకోయ ఆక్సిజన్ పార్కు వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. ఉద్యమ నేతగా తెలంగాణను సాధించిన కేసీఆర్.. ఆ తర్వాత స్వరాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి సబ్బండ వర్గాల్లో వెలుగులు నింపారని కొనియాడారు.
విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా ఏ రంగమైనా దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తున్నదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ అంటేనే ఓ చరిత్ర అని.. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. సచివాలయానికి రాజ్యాంగ రచయిత పేరు పెట్టి అంబేద్కర్పై ఉన్న గౌరవాన్ని సీఎం కేసీఆర్ చాటుకున్నారని కొనియాడారు. ఈ కార్యకమంలో జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, కలెక్టర్ హరీశ్, డీసీపీ సందీప్, జిల్లా అధికారులు పద్మజారాణి, విజయకుమారి, కిషన్ మున్సిపల్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.
మిన్నంటిన జై తెలంగాణ, జై భారత్ నినాదాలు..
కళాకారుల వాయిద్యాలు.. విద్యార్థుల ఆటపాటలు.. నృత్యాలు.. బోనాల ఊరేగింపులు.. జై తెలంగాణ.. జై జై భారత్ నినాదాలతో సభాప్రాంగణం మార్మోగింది. విద్యార్థుల, కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.