Brahmana sadanam | శేరిలింగంపల్లి, మే 31 : సర్వజన సమాదరణే విధానంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించారు. 9 ఎకరాల్లో రూ.12 కోట్ల వ్యయంతో అద్భుతంగా నిర్మించిన ఈ భవనంలో నిర్వహించిన చండీయాగం పూర్ణాహుతిలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం వేదమంత్రోచ్ఛరణల మధ్య పీఠాధిపతులు, అర్చకులు, పండితుల ఆశీర్వాదంతో దేశంలోనే తొలిసారి సనాతన సంస్కృతి కేంద్రంగా విలసిల్లిన బ్రాహ్మణ సదనానికి ఆయన రిబ్బన్ కట్ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన అర్చకులు, బ్రాహ్మణులకు వరాల జల్లు కురిపించారు. ఈ బ్రాహ్మణ సదనం వేద విజ్ఞాన భాండాగారంగా, పీఠాధిపతులు, ధర్మాచార్యుల విడిది కేంద్రంగా, పేద బ్రాహ్మణ కల్యాణాలకు వేదికగా సేవలందించాలన్నారు. విప్రహిత సకల జనహితగా ఆదరింపబడాలని ఆయన ఆకాంక్షించారు.
సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా అందరి ముఖాల్లో చిరు నవ్వులు పూయించేందుకు వినూత్న పథకాలు అమలు చేస్తూ..అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తూ సర్వత్రా ప్రశంసలు అందుకున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా బ్రాహ్మణుల సంక్షేమం కోసం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లిలో 9 ఎకరాల్లో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని సీఎం కేసీఆర్ బుధవారం వేద పండితుల సమక్షంలో అట్టహాసంగా ప్రారంభించి బ్రాహ్మణులపై వరాల జల్లు కురిపించారు. ప్రతి నెల ఇచ్చే భృతిని రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంచడం, దీనికి అర్హత వయస్సును 75 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు తగ్గింపు.. ధూప దీప పథకానికి ప్రతి నెల ఇచ్చే నగదును రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచాతామని ప్రకటించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గోపన్పల్లి విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. బుధవారం తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చేతులమీదుగా విప్రహిత బ్రాహ్మణ సదనంను ప్రారంభించారు. గోపన్పల్లిలో 9 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న బ్రాహ్మణ సదనంలో రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించిన కల్యాణ మండపం, సమాచార కేంద్రం, పీఠాధిపతుల, ధర్యాచార్యుల సదనం మొత్తం మూడు భవన సముదాయాలను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు కేవీ రమణాచారి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వవిప్, శేరిలింగంపల్లి శాసనసభ్యుడు అరెకపూడి గాంధీ, టీఎస్ఐడీసీ చైర్మన్ సముద్రాల వేణుగోపాలాచారి, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిలు పాల్గొన్నారు.
పీఠాధిపతులను సన్మానించిన కేసీఆర్ విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన విశాఖ శారద పీఠాధిపతులు జగద్గురు స్వరూప నందేంద్ర సరస్వతీ స్వామి, ఉత్తర పీఠాధిపతులు స్వాత్మా నందేంద్ర సరస్వతీ మహాస్వామి, తుని పీఠాధిపతి స్వచ్చిదానంద స్వామి, మంత్రాలయ రాఘవేంద్ర పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ స్వామిలను సభావేదికపై సీఎం కేసీఆర్ ఘనంగా సన్మానించారు.
తరలివచ్చిన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నేతలు ఆలిండియా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు ప్రదీప్జ్యోతితో పాటు దేశ వ్యాప్తంగా వివిధ జ్యోతిర్లింగాల ఆలయాల ప్రధాన అర్చకులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఆలయాల ప్రధాన అర్చకులు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నాయకులు, వేద బ్రాహ్మణులు, ఆలయాల అర్చకులు వేలాది సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.
జై కేసీఆర్..
సీఎం కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకొగానే సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. దేశ్ కి నేతా కేసీఆర్, కేసీఆర్ జిందాబాద్ అంటు పెద్ద ఎత్తున సభాప్రాంగణం నినాదాలతో హోరెత్తింది. సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నంత సేపు జయహో కేసీఆర్ అంటు బ్రాహ్మణ సంఘాల నాయకులు, ప్రతినిధులు నినాదాలిచ్చారు. చప్పట్లతో హర్షాతిరేకాలు తెలియజేశారు.