దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పింఛన్ అందిస్తూ.. సీఎం కేసీఆర్ తమకు ఆత్మబంధువుగా
నిలిచారంటూ కీర్తించారు దివ్యాంగులు. పింఛన్ను మరో వెయ్యి రూపాయలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ.. ఆదివారం సైతం దివ్యాంగులు పలు చోట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి.. తమ అభిమానాన్ని చాటుకున్నారు. జలవిహార్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టిందంటూ.. ఇంత మంచి మనసున్న ముఖ్యమంత్రి మనకు ఉండడం అదృష్టమని చెప్పారు.
ఖైరతాబాద్, జూన్ 11 : దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పింఛన్ అందిస్తూ తమకు ఆత్మబంధువుగా సీఎం కేసీఆర్ నిలిచారంటూ దివ్యాంగులు నిరాజనాలు పలికారు. దివ్యాంగులకు పింఛన్ పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో జలవిహార్ వేదికగా నిర్వహించిన దివ్యాంగులతో అభినందన కార్యక్రమం వేడుకగా సాగింది. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన దివ్యాంగులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో రూ.500 ఉన్న దివ్యాంగుల పింఛన్ను రూ.4,016కు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. గతంలో వారికి వాహనాలు, పరికరాలను సబ్సిడీపై ఇచ్చే వారని, తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఉచితంగానే అందిస్తుందని, దివ్యాంగులు సంతోషంగా ఉండాలన్నది సీఎం ఆలోచన అని అన్నారు. ఇలాంటి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు కావాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు.
సహపంక్తి భోజనం చేసి…
దివ్యాంగుల అభినందన కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 4వేల మంది హాజరయ్యారు. వారందరికీ భోజనం, మంచినీరు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ దివ్యాంగులతో కలిసి సహపంక్తి భోజనం చేసి వారితో ఆత్మీయత పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, దానం నాగేందర్, ముఠా గోపాల్, తెలంగాణ హ్యాండిక్యాపడ్ కో ఆపరేటీవ్ కార్పొరేషన్ చైర్మన్ కె.వాసుదేవ రెడ్డి, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ కె. ప్రసన్న, బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్, దివ్యాంగుల సంఘం ప్రతినిధులు యాదగిరి, భాస్కర్, దివ్యాంగుల ఇండియన్ క్రికెట్ కెప్టెన్ మహేశ్, కార్పొరేటర్లు వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, సామల హేమ, లాస్య నందిత, మహేశ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.