కార్పొరేట్ వైద్యం.. ఇప్పుడు పేదల ముంగిట్లోకే వచ్చింది. ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వైద్యరంగానికి పెద్దపీట వేశారు. 2014లో రూ. 2,100 కోట్లు ఉన్న ఆరోగ్య శాఖ బడ్జెట్ను 2023 నాటికి 12,367 కోట్లకు పెంచారు. నిధులు కొరత లేకపోవడంతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. దేశానికే తెలంగాణ హెల్త్ హబ్గా మారింది. మహానగరంలో నలుదిక్కులా నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు పునాదిరాయి పడింది. గల్లీ గల్లీలో బస్తీ దవాఖానలు వచ్చాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిమ్స్లో రెండు వేల పడకల సామర్థ్యం కలిగిన దశాబ్ది భవన్కు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. మరో వైపు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, సబితాఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డిలు పాల్గొన్నారు. అత్యాధునిక సదుపాయాలతో పైసా ఖర్చులేకుండా అందుతున్న సర్కారు వైద్యసేవలను వారంతా కొనియాడారు. పేదలకు నాణ్యమైన సేవలందిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని అభినందించారు.
దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం వైద్య, ఆరోగ్య దినోత్సవం సందర్భంగా దశాబ్ది బ్లాక్ పేరుతో నిమ్స్ హాస్పిటల్ భవనాలకు సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. ఈ దశాబ్ది భవనాల నిర్మాణంతో నిమ్స్కు
అత్యాధునిక వసతులతో కూడిన మరో 2వేల పడకలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) 4000పడకలతో దేశంలోనే అతి పెద్ద హాస్పిటల్గా అవతరించనుంది. కొత్త భవనం అందుబాటులోకి వస్తే నిమ్స్ సామర్థ్యం 4వేలకు పెరిగి దేశంలోనే అతి పెద్ద దవాఖానగా మారనుంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టం. నిమ్స్తో పాటు నగరంలో చుట్టూ నిర్మిస్తున్న సూపర్స్పెషాలిటీ దవాఖానలతో స్పెషాలిటీ సేవలు రోగులకు మరింత చేరువవుతాయి. 2009లో సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఇదే నిమ్స్లో నిరాహార దీక్ష చేసి మృత్యువు వరకు వెళ్లినప్పుడు నిమ్స్ వైద్యులు ఆయన్ను కంటికి రెప్పలా చూసుకుని కాపాడుకున్నారు. నేడు సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. తెలంగాణ వచ్చిన తరువాత నిమ్స్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఈ దవాఖానకు తాను డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే నూతన భవనానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేయడం ఎంతో సంతోషంగా ఉంది.
– నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప