సిటీబ్యూరో, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ)/అమీర్పేట: గిరిజనుల గుండెల్లో సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా నగరంలోని బంజారాహిల్స్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బంజారా, ఆదివాసీ భవన్లను ఈ నెల 17న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఎమ్మెల్యే దానం నాగేందర్లు ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. బంజారా హిల్స్లో అత్యంత విలువైన ప్రాంతంలో రెండెకరాల స్థలంలో 50 కోట్లతో భవనాలను నిర్మించుకోవడం జరిగినదని, ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ తెలిపారు.
సీఎం కేసీఆర్ గిరిజనుల కోసం గురుకుల విద్య, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, ఆసరా పెన్షన్ల వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. ఈ రాష్ట్రంలో 3,146 గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లోని తండాలను, గూడాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసుకుని వారు గౌరవంగా పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పోడు భూముల సమస్యను పరిషరించుకుంటూ, పది లక్షల ఎకరాలకు, గిరిజన ఆదివాసీలకు పోడు భూముల పట్టాల ఇవ్వబోతున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల అమలు కోసం తీర్మానం చేసి పంపినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం స్థలం కేటాయించినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆయన మండిపడ్డారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని తలసాని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబబాద్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు, జీసీసీ చైర్మన్ వాల్యా నాయక్, కార్పొరేటర్ మన్నె కవితా రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రూప్ సింగ్, గిరిజన శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.