Hyderabad Traffic | సిటీబ్యూరో, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : మహానగరాన్ని పీడిస్తున్న ట్రాఫిక్ సమస్యపై సీఎం సీరియస్ అయ్యారు. దీంతో పోలీసు యంత్రాంగం ట్రాఫిక్పై ఫోకస్ పెట్టింది. శనివారం బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో నగర కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, రాచకొండ సీపీ సుధీర్బాబు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, హెచ్ఎండీఏ కమిషనర్ దాన కిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, ఇతర విభాగాల అధికారులు, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, మెట్రో రైలు, జలమండలి, ఎలక్ట్రిసిటీ శాఖలకు చెందిన అధికారులు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ సమస్య నివారణకు అన్ని శాఖల అధికారుల సలహాలు, సూచనలతో ప్రత్యేక ప్రణాళికను రూపొందించేందుకు పోలీసు యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది.