దుండిగల్, అక్టోబర్ 6 : పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సీఎం బ్రేక్ఫాస్ట్ పథకానికి శ్రీకారం చుట్టిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బహదూర్పల్లిలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన సీఎం బ్రేక్ఫాస్ట్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీడీఎంఏ కమిషనర్ పమేలా సత్పతి, జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్తో కలిసి విద్యార్థులకు టిఫిన్ వడ్డించారు. అనంతరం వారితో కలిసి టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఏం కేసీఆర్ లక్ష్యమన్నారు.
పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారాన్ని అందించాలన్న సంకల్పంతో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం పాఠశాల ప్రాంగణంలో రోజుకో రకం నాణ్యమైన టిఫిన్ను అందిస్తారన్నారు. సీడీఎంఏ కమిషనర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికే మన ఊరు- మన బడి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసుతులు కల్పించిందన్నారు. అంతకు ముందు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో దుండిగల్ మున్సిపల్ కమిషనర్ కె.సత్యనారాయణరావు, గండిమైసమ్మ- దుండిగల్ తాసీల్దార్ సుచరిత, దుండిగల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తుడుం పద్మారావు, కౌన్సిలర్లు నర్సారెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఎల్లుగారి సత్యనారాయణ, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రగతినగర్లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మేయర్ కొలన్ నీలా గోపాల్రెడ్డి పాల్గొని ‘సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీం’ను ప్రారంభించారు. కార్యక్రమంలో కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ ధన్రాజు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
దుండిగల్, అక్టోబర్ 6 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్ఫాస్ పథకంతో విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నాయి. ఈ అల్ఫాహార పథకంలో భాగంగానే శుక్రవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహదూర్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీఎం కేసీఆర్ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్తోపాటు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రారంభించారు.
వేర్వేరు పోషక విలువలతో కూడిన టిఫిన్ను ఆరురోజులపాటు అందించడం ద్వారా తమకు పౌష్టికరమైన ఆహారం అందుతుంది. ఇలాంటి పౌష్టికాహారం ఆటలు, క్రీడల్లో రాణించే వారికి చాలా అవసరంగా ఉంటుంది. చదువుతోనే ఉదయం సమయంలో అల్పాహారం ఇవ్వడం చాలా సంతోషంగా ఉన్నది.
– కుమారస్వామి, పదవతరగతి, బహదూర్పల్లి
సీఎం బ్రేక్ఫాస్ట్తో పిల్లల్లో పోషణ లోపాలు తగ్గుతాయి. చాలా చిరుధాన్యాలు, తృణధాన్యాలు పేదలు కొనలేరు. చిన్నారుల పరిస్థితిని ఆలోచించి అమలు చేస్తున్న పథకాలు చాలా బాగున్నాయి.
– మురళీధర్రెడ్డి, ఉపాధ్యాయుడు,
ప్రభుత్వ పాఠశాలకు పంపే అందరూ పేద, చిన్న ఉద్యోగులే. భార్యభర్తలు ఇద్దరూ పనికి వెళాల్లి ఉంటుంది. ఉదయం టిఫిన్ కొని పిల్లకు పెట్టలేని పరిస్థితి. ప్రభుత్వమే మధ్యాహ్నా భోజనం ఇచ్చిన సాయం చేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ బ్రేక్ఫాస్ట్ కూడా అందించడం చాలా సంతోషంగా ఉంది.
– మల్లేశ్, విద్యార్థి తండ్రి, బహదూర్పల్లి