సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ) : కరోనాకు చెక్ పెట్టే ‘క్లెవైరా’ ఆయుర్వేద మాత్రలు అందుబాటులోకి వచ్చాయి. అపెక్స్ ల్యాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ తయారుచేసిన ఈ మాత్రలను సోమవారం ఎర్రమంజిల్లోని హోటల్ మెర్క్యూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మార్కెట్లోకి విడుదల చేశారు. డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వైరల్ వ్యాధులను అడ్డుకునేందుకు 2017లోనే క్లెవైరా మాత్రలను అందుబాటులోకి తెచ్చినా, కరోనాకు వాడేందుకు అనుమతి రాలేదు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ అనుమతితో 2020 జూన్లో ఈ మాత్రలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు.
సాధారణ మాత్రలతో పోల్చితే రికవరీ వేగంగా అయినట్టు గుర్తించారు. స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారిలో 5 రోజుల్లోనే 86 శాతం మందికి నెగెటివ్, 10 రోజుల్లో 100 శాతం మందికి నెగెటివ్ వచ్చినట్లు వైద్యనిపుణులు తెలిపారు. ట్రయల్స్ విజయవంతం కావడంతో సాధారణ లక్షణాలు ఉన్న రోగులకు సపోర్టివ్ చికిత్సగా క్లెవైరా మాత్రలను అందించేందుకు ఆయుష్ శాఖ గత ఏప్రిల్లో అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. సమావేశంలో ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఎన్.సుబ్రహ్మణ్యం, డాక్టర్ జయకృష్ణ, డాక్టర్ మూర్తి, డాక్టర్ ఏవీఎస్ కుమారస్వామి, డాక్టర్ మహేంద్రగుప్తా, డాక్టర్ ఎం.జనార్దన్ పాల్గొన్నారు.
ప్రతిరోజు రెండు పూటలా ఒక్కో మాత్ర భోజనం తర్వాత తీసుకోవాలి. 14 రోజుల పాటు వాడాలి. 28 మాత్రల ధర రూ.300. ఇంట్లో ఎవరికైనా కరోనా సోకితే మిగతావారు ముందు జాగ్రత్తగా 5రోజుల పాటు ఈ మాత్రలను వాడవచ్చని వైద్యులు సూచించారు.