సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో ఇంటింటి చెత్త సేకరణ లక్ష్యం నీరుగారుతున్నది. ఎక్కడి వ్యర్థాలు అక్కడే పేరుకుపోతున్నాయి. స్వచ్ఛత ప్రశ్నార్థకమవుతున్నది. చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా మూడున్నరేండ్ల కిందట డస్ట్ బిన్ లెస్ సిటీ పేరుతో చెత్త కుండీలను జీహెచ్ఎంసీ తొలగించింది. పకడ్బందీగా పారిశుధ్య నిర్వహణ చేపట్టి..వందకు వంద శాతం ఇంటింటి చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటోల సంఖ్యను పెంచారు.
సుమారు 5250 వాహనాల ద్వారా సిటీలోని 4886 కాలనీల్లో 23 లక్షల గృహాల నుంచి రోజుకు 7వేల మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాలను సేకరించాలి. ఒకొక అటోకు సుమారు 500 నుంచి 600 ఇండ్లను కేటాయించి.. చెత్త సేకరణ చేయాలి. కానీ కొన్ని రోజులుగా అలా జరగడం లేదు. చాలా కాలనీలకు రోజూ స్వచ్ఛ ఆటోలు రావడం లేదు. వందకు వంద శాతం వాటి అటెండెన్స్ ఉండటం లేదు. ప్రతిరోజు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదని స్వయంగా కమిషనర్ రోనాల్డ్ రాస్ ఇటీవల గుర్తించారు. పర్యవేక్షణ లోపించిందని జోనల్ కమిషనర్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
స్వచ్ఛ ఆటోల పనితీరులో కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కాగా, సమయ పాలన పట్టించుకోకపోవడం, వ్యర్థాల సేకరణలో అధిక వసూళ్లకు తెరలేపడం, సిటీలో ఉండాల్సిన స్వచ్ఛ ఆటోలు గ్రేటర్ సరిహద్దులు దాటడం వంటి వ్యవహారాలపై ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్వచ్ఛ ఆటోలను దారిలోకి తీసుకురావాలని, ఉదయం వాహనం బయలుదేరే సమయం..వ్యర్థాల సేకరణ పూర్తయ్యాక ట్రాన్స్ఫర్ స్టేషన్లకు వెళ్లే వరకు ‘క్యూ ఆర్’ స్కాన్ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని నగరవాసులు కోరుతున్నారు.