సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 28(నమస్తే తెలంగాణ): గత తొమ్మిదిన్నరేండ్ల హైదరాబాద్ అభివృద్ధికి జాతీయంగా, అంతర్జాతీయంగా వచ్చిన ప్రశంసలు కొన్ని. మరి.. హైదరాబాద్లో నివసిస్తున్న ఒక సగటు నగరవాసికి ఇంతకంటే గర్వకారణం ఏముంటుంది?! అందుకే నిత్యం సోషల్ మీడియాలో హైదరాబాద్ అభివృద్ధి చిత్రాలు పోస్టింగ్ చేసేందుకు నగరవాసులు పోటీ పడుతున్నారు. తమ సృజనాత్మకతను జోడించి మురిసిపోతున్నారు.
ముఖ్యంగా దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలుస్తూ హైదరాబాద్ అభివృద్ధిపై చర్చ అనేది నిత్యం ఓ ట్రెండింగ్. అందుకే హైదరాబాద్ మహా నగర పరిధిలోని వారందరూ ఈ అభివృద్ధి ఫలాలను అనుభవిస్తున్నారు.. ఆస్వాదిస్తున్నారు. ఇదే తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రతిఫలిస్తున్నట్లుగా కనిపిస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇతర రాజకీయాంశాలు ఎలా ఉన్నా.. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బేరీజు వేసినా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (షాద్నగర్తో కలుపుకొని) పరిధి రాజకీయ ముఖచిత్రంపై అభివృద్ధి అనేది ఆది నుంచి సామాన్యుడి ఎజెండాగా ఉంటుందనే వాస్తవం అర్థమవుతుంది. ఈ క్రమంలో దాదాపు 21 నియోజకవర్గాల్లో గులాబీ పార్టీకి మొగ్గు ఉన్నదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ హైదరాబాద్ అభివృద్ధి అనేది ప్రతి ఎన్నికల్లో ఒక ఎజెండాగా వస్తున్నది. అంతేకాదు.. ఇక్కడి అభివృద్ధి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలపైనా ప్రభావం చూపుతున్నదని గత ఎన్నికల్లోనూ వెల్లడైంది. ఈ క్రమంలో ఉమ్మడి ఏపీలో జరిగిన 2014 ఎన్నికల్లో హైదరాబాద్లోని 15 నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 నియోజకవర్గాలు.. హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే షాద్నగర్ నియోజకవర్గం (తాజాగా రంగారెడ్డి జిల్లా) ఇలా 30 నియోజకవర్గాలను ప్రామాణికంగా తీసుకుంటే అభివృద్ధి వైపు ఓటర్లు ప్రభావితులవుతున్నట్లుగా తెలుస్తున్నది. 2014 ఎన్నికల్లో 30 నియోజకవర్గాల్లో సుమారు 95.10 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఆ ఎన్నికల్లో సరాసరిన 55శాతం పోలింగ్ నమోదైంది. పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాలు మజ్లిస్ కంచుకోటగా ఉన్నాయి. కాగా ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 23.28 శాతం ఓట్లు రాగా.. తెలుగుదేశం పార్టీకి 20.31 శాతం, కాంగ్రెస్కు 17.36 శాతం, బీజేపీకి 12.45 శాతం ఓట్లు వచ్చాయి. సీట్లపరంగా బీఆర్ఎస్కు ఐదు సీట్లు మాత్రమే రాగా.. టీడీపీకి పదకొండు, బీజేపీకి ఐదు, కాంగ్రెస్కు రెండు సీట్లు వచ్చాయి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నాలుగున్నర సంవత్సరాల్లోనే నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది. దీంతో తదుపరిగా 2018లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు గులాబీ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. ఆ ఎన్నికల్లో 30 నియోజకవర్గాల్లో సుమారు 95.28 లక్షల మంది ఓటర్లు ఉంటే.. సరాసరిన 56శాతం పోలింగ్ నమోదైంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి ఏకంగా 41.35శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్కు 23.69శాతం, బీజేపీకి 11.95శాతం ఓట్లు వచ్చాయి. సీట్లపరంగా బీఆర్ఎస్ 20స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలకే పరిమితం కాగా బీజేపీ ఒక్క స్థానంతో సంతృప్తిపడాల్సి వచ్చింది. అంటే 2014తో పోలిస్తే.. బీఆర్ఎస్కు అభివృద్ధి మంత్రం ఎంతగా పని చేసిందో అర్థం చేసుకోవచ్చు.
గతంలో పోలిస్తే హైదరాబాద్ మహా నగరవాసుల్లో అభివృద్ధి పట్ల అవగాహన, సామాజిక స్పృహ గణనీయంగా పెరిగింది. ఇందుకు సోషల్ మీడియా రావడం ఒక వంతైతే.. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రావడం, మౌలిక వసతులు భారీగా వచ్చి వాటి ఫలాలు కండ్లారా చూడటంతో వాటి పట్ల అవగాహన గణనీయంగా పెరిగింది. దీంతో సోషల్ మీడియాలో ఇతర నగరాల పరిస్థితి కూడా క్షణాల్లో తెలవడం, నగరాల మధ్య అభివృద్ధిపై బేరీజులు.. తద్వారా చర్చలు జరగడంతో ప్రభుత్వాల పనితీరు ఎలా ఉండాలి? అభివృద్ధితో జీవన ప్రమాణాలు ఎలా పెరుగుతాయనే విషయం సామాన్యుడికి సైతం అర్థమైంది.
ఈ నేపథ్యంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా హైదరాబాద్ మహా నగరాభివృద్ధి.. అదే తరుణంలో పొరుగున ఉన్న రాష్ర్టాల్లోని నగరాల పరిస్థితి.. అందునా బెంగళూరు నగరంలో మౌలిక వసతుల కల్పన లేక ఎలా డీలా పడిందనే వివరాలు అందరి స్పృహలో ఉన్నాయి. దీంతో రాజకీయాంశాల కంటే అభివృద్ధి అనేది ప్రజల్లో ప్రధాన ఎజెండాగా మారింది. అదే ఎన్నికల్లోనూ ఓటర్లను ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే 30 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు 21 స్థానాల్లో అనుకూల వాతావరణం ఉన్నదని వారు విశ్లేషిస్తున్నారు.
బెంగళూరు నగరంలో ట్రాఫిక్ నరకం… హైదరాబాద్ నగరంలో విశాలమైన రహదారులు
– ఓ నెటిజన్ స్వీయానుభవం
హైదరాబాద్ నగరంలో తిరుగుతుంటే న్యూయార్క్లో ఉన్నట్లుగా ఉంది
– తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కితాబు
90 దశకంలో ఇక్కడికి వచ్చాను… అప్పటికి ఇప్పటికీ హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. ఇక్కడే స్థిరపడాలనిపిస్తుంది.
– బీజేపీ ఎంపీ సన్నీడియోల్ ప్రశంస
బెంగళూరులో మౌలిక వసతులు, ప్రభుత్వ పాలసీలు బాగా లేవు. హైదరాబాద్లో మౌలిక వసతులు బాగున్నాయి.. ఇక్కడి ప్రభుత్వ పాలసీలు ఉత్తమంగా ఉన్నందునే కంపెనీని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం
-కీన్స్ సీఈవో రాజేశ్ శర్మ బహిరంగ వ్యాఖ్య