సిటీబ్యూరో, మార్చ్ 21(నమస్తే తెలంగాణ): ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ముస్లింల ప్రార్థనలు పెద్ద ఎత్తున జరిగాయి. హైదరాబాద్ మీరాలం ఈద్గా వద్ద ముస్లింలు భారీ సంఖ్యలో హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీరాలంలో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ప్రార్థనల అనంతరం ఆయన చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలంతా సుఖసంతోషాలతో, ప్రశాంతంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
రంజాన్ మాసమంతా నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగియడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల షాపింగ్ అవసరాలకు, ప్రార్థనలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశామని, అందరి సహకారంతో వేడుకలు విజయ వంతమయ్యామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సౌత్ రేంజ్ అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, నార్త్రేంజ్ జాయింట్ సీపీ శ్వేత, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్డేవిస్, కార్ హెడ్క్వార్టర్స్ డీసీపీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ జోన్ డీసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ డీసీపీ అవినాశ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.