డీజిల్ బస్సులకు టీఎస్ ఆర్టీసీ స్వస్తి పలకనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రోజురోజుకూ డీజిల్ ధరలు పెరుగుతుండటం.. ఎలక్ట్రిక్తో ఖర్చు ఆదా అవుతుండటంతో డీజిల్ బస్సులను కన్వర్షన్ చేయాలని నిశ్చయించింది. ఆర్టీసీ యాజమాన్యం వద్ద అధికంగా ఉన్న డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులను తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే డిజీల్ బస్సులను పూర్తిగా తొలగించి ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేసే శక్తి ఆ సంస్థకు లేదు. దీంతో ప్రత్యామ్నాయ ఆలోచన చేసింది. ఇప్పుడు తిరుగుతున్న డీజిల్ బస్సులను ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చే అవకాశాలపై దృష్టి పెట్టింది. తక్కువ ఖర్చుతో అన్ని బస్సులను ఎలక్ట్రికల్ బస్సులుగా కన్వర్షన్ చేయాలని నిశ్చయించింది. ఇందులో భాగంగా బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థతో గత నెలలో ఆర్టీసీ ఉన్నతాధికారులు సంప్రదింపులు జరిపారు. ప్రయోగాత్మకంగా తొలుత ఓ డీజిల్ బస్సును ఈవీగా మార్చేయనున్నారు. ఈ ప్రయోగం దేశంలో మొదటిది కానున్నదని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని బస్సులు ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చుతారు. ఆ తర్వాత సాధ్యాసాధ్యాలను పరిశీలించి దశల వారీగా జిల్లాల్లోని అన్ని బస్సులు ఈవీలుగా మార్చే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.