సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహా నగరం రోజు రోజుకూ విస్తరిస్తున్నది. కొత్తగా పెద్ద పెద్ద కాలనీలు వెలుస్తున్నాయి. ఔటర్ రింగు రోడ్డుకు అవతల కూడా అనేక కొత్త కాలనీలు పుట్టుకొస్తున్నాయి. దీంతో ఆర్టీసీ అధికారులు బస్సులను నడిపించేందుకు కొత్త మార్గాలపై దృష్టిసారించారు. ఇందుకు ప్రత్యేకంగా సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం మియాపూర్ నుంచి ఎల్బీనగర్, ఉప్పల్ నుంచి గచ్చిబౌలి మార్గాల్లో నగర ప్రజలకు మెట్రో రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే, పెరుగుతున్న కాలనీల్లో ఉండే ప్రయాణికుల కోసం సిటీ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ అధికారులు దృష్టి సారించారు.
తోడుగా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో రోడ్ల విస్తరణ కూడా వేగంగా జరుగుతున్నది. సిటీ బస్సుల ఆదాయం పెంచుకోవడం, నాణ్యమైన సేవలు అందించడంలో భాగంగా కొత్త మార్గాల్లో బస్సులను తిప్పాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు ఆర్టీసీ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఏయే మార్గాల్లో ఎన్ని బస్సులు నడిపించాలి..? ఆ బస్సులలో ఆక్యుపెన్సీ వస్తుందా..? మెట్రో స్టేషన్ల నుంచి కాలనీలకు లింక్ బస్సులు ఏర్పాటు చేయాలా..? రోజులో ఎన్ని బస్సులు నడిపించాల్సి ఉంటుంది..? వంటి అంశాలపై అధ్యయనం చేస్తున్నారు. ప్రయోగంగా కొన్ని మార్గాల్లో కూడా బస్సులను నడిపించి, సగటు ఆక్యుపెన్సీ ఎలా వస్తుంది అన్న అంశాలపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు.
కొత్త మార్గాల్లో బస్సులను నడిపించాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా కూకట్పల్లి నుంచి చౌటుప్పల్ వరకు, ఈసీఐఎల్ నుంచి మేడ్చల్ వరకు సిటీ బస్సు సర్వీసులను పొడిగించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆర్టీసీ జీహెచ్ఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.