హిమాయత్నగర్, ఆగస్టు 15: గోమాతను రక్షించుకుని, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని త్రిదండి చిన జీయర్ స్వామి అన్నారు. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని కోరుతూ అయ్యప్ప సేవా సమితి పాదయాత్ర చేపట్టింది. 50 మంది గో సేవకులు గోవింద మాల ధరించి ఆదివారం హిమాయత్నగర్లోని టీటీడీ నుంచి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. ఈ కార్యక్రమానికి త్రిదండి చిన జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరై పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన దేశ చరిత్ర చాలా గొప్పదన్నారు. ఎంతో మంది త్యాగధనుల పోరాటం, ప్రాణాల బలిదానం ఫలితంగా స్వాతంత్య్రం లభించిందని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినప్పటికీ ఫలాలను ఆస్వాదించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు, గురుస్వామి బాలకృష్ణ, ప్రతినిధులు జస్మిత్ పటేల్, దైవజ్ఞశర్మ, శివకుమార్, సదానంద్ యాదవ్, రామకృష్ణస్వామి, చంద్రస్వామి, గాయత్రి, సురేఖ, సంతోష్, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.