తెలుగు యూనివర్సిటీ, మే 24 : సాహిత్యంలో అత్యంత క్లిష్టమైన ప్రక్రియ బాల సాహిత్యాన్ని సృశించడమేనని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. బాలల సాహిత్యం మెరుగైన సమాజాన్ని నెలకొల్పుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల బాల సాహిత్య సమ్మేళనం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ పరిషత్తు ముద్రించిన బాల కథా సౌరభం గ్రంథాన్ని ఆవిష్కరించి మాట్లారు. సాంకేతికత పరిజ్ఞానాన్ని విశేషంగా వినియోగించుకుంటున్న అమెరికాలో కూడా అందరి చేతుల్లో పుస్తకాలు కనబడుతాయని అన్నారు. బాలల కోసం రచనలు చేసేవారిలో పసితనం తప్పక ఉండాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవీ రమణాచారి ప్రసంగిస్తూ స్మార్ట్ఫోన్ల వల్ల కలుగుతున్న లాభాలతో పాటు నష్టాలు కూడా సమాజంపై పెను ప్రభావం చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూనే భాషా సాహిత్యాలు, కళలు, సంస్కృతులను పట్టించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. పద్మభూషణ్ డాక్టర్ కె.ఐ వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ సాహిత్యం పట్ల అభిరుచిని తన తల్లి కోడూరు శాంతమ్మ కలిగించారని పేర్కొన్నారు.
పద్యం ఆమె నుంచే నేర్చుకున్నానని ఆయన గుర్తు చేశారు. బాలల్లో సాహిత్యం, కళా సంస్కృతుల పట్ల అభిరుచి కల్పించకపోతే భవిష్యత్తుకు నష్టం కలుగుతుందని ఆయన హెచ్చరించారు. పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ బాలల సాహిత్య సమ్మేళనం నిర్వహణకు వరప్రసాదరెడ్డి అందించిన విరాళంతో కొనసాగిస్తూ బాలల కోసం ప్రత్యేకంగా అద్భుతమైన సాహిత్య గ్రంథాలను పరిషత్తు ముద్రించి అందిస్తుందని వివరించారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య మాట్లాడుతూ రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ సమ్మేళనంలో బాలల సాహిత్యానికి సంబంధించిన వివిధ అంశాలపై సదస్సులు, చర్చాగోష్ఠులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారగ్రహీతలు డాక్టర్ ఎం.భూపాల్, కన్నెగంటి అనసూయ, డాక్టర్ పత్తిపాక మోహన్ పాల్గొన్నారు.
సాహిత్య సౌరభాలను పంచిన సమ్మేళనం..
కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ దాసరి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సదస్సులో బాల సాహిత్యం-మౌలికాంశాలు అనే అంశాలపై బాల సాహితీవేత్త ముంజలూరి కృష్ణకుమారి పాల్గొని బాల సాహిత్యం-భాష, శైలి, వస్తువు అంశంపై, రచయిత డాక్టర్ ఎం. హరికిషన్ పాల్గొని బాల సాహిత్యం, నైతిక విలువలు, మానవ సంబంధాలు అంశంపై, రచయిత కె. శాంతారావు పాల్గొని బాల సాహిత్యం-వైజ్ఞానికాంశాలు, హేతువు అంశంపై. రచయిత్రి స్వర్ణ కిలారి పాల్గొని ఇతర భారతీయ భాషలు, ఆంగ్లంలో బాల సాహిత్యం అంశంపై ప్రసంగించారు. బాల సాహిత్య నాడు నేడు చర్చా గోష్ఠి బాల సాహితీవేత్త డాక్టర్ అమరవాది నీరజ అధ్యక్షతన జరుగగా పలువురు వక్తలు ప్రసంగించారు. ప్రముఖ రచయిత్రి వి. శాంతి ప్రభోధ అధ్యక్షతన బాలల కోసం వివిధ నైపుణ్యాలు అంశంలో భాగంగా ఉపన్యాస కళ అంశంపై వ్యక్తిత్వ వికాస నిపుణులు జి.వి.ఎన్ రాజు, కథలు చెప్పే కళపై కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చొక్కాపు వెంకటరమణ ప్రసంగించారు. రచయిత డాక్టర్ వి.ఆర్. శర్మ అధ్యక్షతన బాలల కథా రచన మెలకువలు అంశంలో భాగంగా కథా రచన-భాష శైలిపై నాటక కర్త పెద్దింటి అశోక్ కుమార్, వస్తువు శిల్పంపై డాక్టర్ సి.ఎ ప్రసాద్ ప్రసంగించారు. బాల సాహితీవేత్తలు పులి జమున, డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు, కూకట్ల తిరుపతి, తిరునగరి వేదింతం సదస్సులను సమన్వయం చేశారు.