సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : చిన్నారులపై జరుగుతున్న దాడుల నివారణే లక్ష్యంగా… అఘాయిత్యాల నుంచి రక్షణ.. తల్లిదండ్రుల బాధ్యత తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ నెక్లెస్ రోడ్లోని జలవిహార్ వద్ద లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్, డిగ్నిటీ డ్రైవ్, యంగిస్తాన్ ఫౌండేషన్ల సంయుక్తాధ్వర్యంలో ‘చైల్డ్ సేఫ్టీ అవేర్నెస్ వాకథాన్’ నిర్వహించారు. ఈ వాకథాన్ను రాచకొండ సీపీ మహేశ్ భగవత్, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మా హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ సునీత, రూట్స్ కళాశాల చైర్మన్ బీపీ పడాల, డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ సీఈఓ రెనే గ్రేస్తో కలిసి ప్రారంభించారు. ఈ వాక్ పీవీ ఘాట్ వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. రోజు రోజుకు పిల్లలపై భౌతిక, లైంగిక దాడులు, హత్యలు పెరుగుతున్నాయని, దేశంలో 54 వేల మంది పిల్లలు బలయ్యారని పేర్కొన్నారు. చట్టాలు ఎన్ని ఉన్నా తల్లిదండ్రులు సైతం తమ వంతు బాధ్యతగా ఇలాంటి ఘటనలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. మహిళలు, పిల్లల రక్షణ కోసం సీఎం కేసీఆర్ కఠినమైన చట్టాలను తీసుకువచ్చారని, షీటీమ్స్ ఆడ పిల్లలకు రక్షణగా నిలుస్తున్నాయన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా తల్లిదండ్రుల్లో అవగాహన పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.