జవహర్నగర్, నవంబర్ 30: బాల కార్మికుడిగా తాను పడిన కష్టాలు తెలుసు. చదువు కోసం తనలాగే మరెవరూ కష్టపడకూడదని భావించాడు. పీజీ వరకు చదివిన తాను బాలకార్మికుల కోసం ముందుకు వచ్చాడు. 2008లోనే జనవాణి బాలల హక్కుల ప్రజాధ్వని నుంచి బాలల హక్కులపై తొలి ఉద్యమం ప్రారంభించాడు. 450 మంది బాలల సంఘాలకు అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేశాడు. బాల కార్మికులు లేని సమాజం నిర్మాణమే లక్ష్యంగా 2011లో స్వేచ్ఛావేదిక సొసైటీని స్థాపించాడు. 70 మంది చిన్నారులకు విద్యానందిస్తున్నాడు. అంతేకాదు ఆరోగ్య శిబిరాలు, తలసేమియా పిల్లలకు రక్తదానం శిబిరాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు స్వేచ్ఛావేదిక సొసైటీ డైరెక్టర్ రాజుయాదవ్. జవహర్నగర్ కార్పొరేషన్లో వలస కార్మికుల పిల్లలు చదువుకు దూరం కావొద్దని రాజుయాదవ్ 2020 నుంచి ఇప్పటి వరకు 300పైగా బాల కార్మికులను గుర్తించి ప్రభుత్వ బడిలో చేర్పించారు.
స్వేచ్ఛా వేదిక ఆధ్వర్యంలో కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి ఉచిత విద్య, లైఫ్ స్కిల్స్పైన అవగాహన కల్పిస్తూ చిన్నారులు, తల్లిదండ్రుల్లో మార్పు తీసుకువస్తున్నారు. కార్పొరేషన్లోని 28 డివిజన్లలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు అందజేస్తున్నారు. కరోనా కాలంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేసి ఆదుకున్నారు. ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించి శానిటైజర్లు, మాస్కులు అందజేశారు. అలాగే 11 రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి తలసేమియా బాధిత చిన్నారుల ప్రాణాలను కాపాడారు. స్వేచ్ఛావేదిక సొసైటీ డైరెక్టర్ రాజు యాదవ్ చేస్తున్న కృషిని గుర్తించి డాక్టర్ ప్రీతీమీనా ప్రశంసాపత్రం అందజేశారు.