సిటీబ్యూరో, జులై 3 (నమస్తే తెలంగాణ): వెట్టి చాకిరి నుంచి ఏడుగురు మైనర్లకు విముక్తి కల్పించారు రాచకొండ షీ టీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు. ఆపరేషన్ ముస్కాన్ -7లో భాగంగా ‘లక్ష్మీ ఫ్రాస్టర్స్’పై దాడులు నిర్వహించిన అధికారులు మైనర్లతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని గుర్తించి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. మైనర్లంతా కర్ణాటక వాసులుగా గుర్తించి వారి వివరాలను దర్పన్ యాప్లో అప్లోడ్ చేశారు. అనంతరం వారిని హయత్నగర్లోని డాన్బాస్కో స్కూల్కు పంపారు. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా ఈ నెలంతా స్పెషల్ డ్రైవ్లు కొనసాగిస్తామని అన్నారు. ఇదిలా ఉంటే వెట్టి నుంచి ఏడుగురు మైనర్లను కాపాడిన రాచకొండ షీ టీమ్స్ డీసీపీ సలీమా, ఆపరేషన్ ముస్కాన్ బృందాన్ని సీపీ అభినందించారు.
పిల్లలతో భిక్షాటన చేయిస్తూ వచ్చిన డబ్బులతో వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కఠినంగా వ్యవహరిస్తామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ హెచ్చరించారు. శనివారం నేరేడ్మెట్లోని సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చౌరస్తాలు, మెట్రో రైళ్లు, ఇతర ప్రదేశాల్లో పిల్లలతో భిక్షాటన చేయిస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. పిల్లలు కదలకుండా ఉండేందుకు మత్తు పదార్థాలు ఇస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. భిక్షాటన చేస్తున్న పిల్లల వివరాలు సేకరిస్తామని.. అవసరమైతే వారి తల్లిదండ్రులను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు చేస్తామన్నారు. ఎవరైనా బాలబాలికలతో వెట్టి చాకిరి, భిక్షాటన చేయిస్తే రాచకొండ వాట్సాప్ నంబర్ 9490617111 లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సీపీ మహేశ్ భగవత్ కోరారు.