ఇంటింటి చెత్త సేకరణలో ఇష్టానుసారం డబ్బులు వసూలు చేస్తామంటే.. ఇక కుదరదు. స్వచ్ఛ ఆటో డ్రైవర్లను గాడిలో పెట్టి.. పారదర్శకంగా వ్యర్థాల సేకరణ జరిగేలా బల్దియా కీలక నిర్ణయాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. కాలనీల్లో ఇంటికి రూ. 100, బస్తీల్లో రూ. 50 వసూలు చేసేలా నిర్దేశిత రుసుమును ఖరారు చేసింది. 17న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించనున్నారు. స్వచ్ఛ ఆటో డ్రైవర్లు ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ మేరకు కనీస చార్జీలను ఖరారు చేశారు.