ఖైరతాబాద్, జనవరి 23 : బిగ్ బాస్ రియాల్టీ షోలో అవకాశం కల్పిస్తానంటూ నమ్మించి ఓ వ్యక్తి తనను మోసం చేశాడని నటి, యాంకర్ స్వప్న చౌదరి వాపోయారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో న్యాయవాది డాక్టర్ కె.రాజేశ్ కుమార్తో కలిసి వివరాలు వెల్లడించారు. టీవీ చానల్స్లో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్న సత్య అనే వ్యక్తి తనకు పరిచయమయ్యాడని, అతడి ద్వారా మెదక్ జిల్లా వర్గల్కు చెందిన తమ్మాలి రాజుతో పరిచయం ఏర్పడిందన్నారు. తాను బిగ్ బాస్ షోలో పనిచేస్తున్నానని, ప్రముఖులతో పరిచయాలున్నాయని రాజు పలువురు నటీ నటులతో దిగిన ఫొటోలను చూపించాడన్నారు. నటి, యాంకర్గా రాణిస్తున్న తనకు బిగ్బాస్లో అవకాశం దొరుకుతుందని, అందుకు కొంత చెల్లిస్తే అది సాధ్యమవుతుందని నమ్మించాడన్నారు. ఆయన మాటలను నమ్మి విడతల వారీగా రూ.2.50లక్షలు చెల్లించానని, బిగ్బాస్లో చాన్స్ రాకపోతే తిరిగి చెల్లిస్తానని అగ్రిమెంట్ కూడా రాసిచ్చాడన్నారు. బిగ్బాస్లో చాన్స్ ఇప్పించకపోవడంతో పాటు తిరిగి డబ్బులు చెల్లించమంటే బెదిరింపులకు దిగుతున్నాడని, జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఐపీసీ 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారన్నారు. అతడిపై చర్యలు తీసుకొని తనలాగా ఎవరూ మోసపోకుండా చేయాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో టి.సాయికుమార్, పప్పు పాల్గొన్నారు.