‘పాతనగరం, కొత్తనగరం అన్న తేడా లేదు.. ప్రాంతం ఏదైనా వివక్ష లేని అభివృద్ధే ముఖ్యం’ అని మొన్నటికి మొన్న ప్రకటించిన ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది. సాగర్ తీరాన ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ‘సండే ఫన్ డే’ను చార్మినార్ చుట్టూ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నది. ఈ మేరకు ప్రజాభిప్రాయ సేకరణ కోరింది. ఇదే విషయమై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్కుమార్ ట్వీట్ చేయగా.. పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ట్యాగ్ చేసి అభిప్రాయం చెప్పాలని కోరారు. కాగా అర్వింద్కుమార్ చేసిన ట్వీట్కు వేలాది మంది నగర ప్రజలు లైక్ కొట్టారు. కొందరు రీ ట్వీట్ చేయగా.. మరికొందరు సానుకూలంగా స్పందించారు. దీంతో చార్మినార్ చుట్టూ ‘సండే ఫన్ డే’ను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.