సిటీబ్యూరో, అక్టోబరు 31 (నమస్తే తెలంగాణ)/చార్మినార్ : హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సన్డే-ఫన్ డే కార్యక్రమానికి నగరవాసుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. హుస్సేన్సాగర్ ట్యాంక్బండ్ అందాల వీక్షణకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారంతా ట్యాంక్బండ్లో సందడి చేశారు. హెచ్ఎండీఏ అధికారులు ఎప్పటిలాగానే షాపింగ్, పుడ్ స్టాల్స్ను ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయించారు. సంధ్యాసమయంలో సాగర తీరంలో సరదాగా గడిపేందుకు నగరవాసులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. దానికి తగ్గట్లుగానే ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతుండడంతో నగరవాసులు ట్యాంక్బండ్పై సరదాగా కుటుంబ సభ్యులతో గడిపారు.
చారిత్రక చార్మినార్ వద్ద ఏక్ శామ్ చార్మినార్కే నామ్తో కొత్త ఒరవడి వచ్చింది. భారీగా తరలివస్తున్న సందర్శకులతో ఆదివారం సాయంత్రం చార్మినార్కు సరికొత్త కళ వచ్చింది. పాతనగర చారిత్రక ప్రాంతాల్లో పర్యాటకులు తమ ఆనందాలను పదిలం చేసుకుంటూ హుషారుగా సన్డే ఫన్డేలో పాల్గొంటున్నారు. చార్మినార్ వద్ద నిర్వహించి స్టేజీ లైవ్ షో యువతను ఉర్రుతలూగించింది. చిన్నా పెద్ద తేడాలేకుండా సంగీత హోరులో హుషారుగా ఆడుతూ మదిలో గీతాలు ఆలపిస్తూ సింగర్లకు తోడుగా తమ స్వరాలను సవరించుకున్నారు. మరో వైపు లాడ్ బజార్లో మట్టి గాజులతోపాటు లక్కగాజులను ఎంతో ఇష్టంగా కొనుగోళ్లు చేస్తూ సందర్శకులు మరింతగా మైమరిచిపోయారు.