ఆహ్లాదానికి ఆలవాలమైన పర్యాటక కేంద్రం హుస్సేన్సాగర్ను మరింత శుభ్రంగా ఉంచేందుకు మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) చర్యలు వేగవంతం చేసింది. సాగరంలోకి వ్యర్థాలు కలువకుండా ఇప్పటికే మూడు చోట్ల 55 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్డే)ల సామర్థ్యంతో సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ)ను నిర్మించారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటిని ఈ కేంద్రాల్లో శుద్ధి చేసి వదులుతారు. అయితే బుల్కాపూర్ నాలా (ఖైరతాబాద్), కూకట్పల్లి-బేగంపేట నాలా (నెక్లెస్ రోడ్డు), పికెట్ నాలాల నుంచి వచ్చే వరద కొంత శుద్ధి కాకుండా సాగర్లో కలుస్తోంది. దీని నియంత్రణకు ఈ మూడు శుద్ధి కేంద్రాల సామర్థ్యాన్ని 55 ఎంఎల్డీల నుంచి 110 ఎంఎల్డీలకు పెంచాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. వీటి నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ కేంద్రాల శుద్ధి సామర్థ్యం పెరిగితే సాగర్లో మురుగు చేరకుండా కట్టడి చేయడంతోపాటు పరిసరాలు చాలా ఆహ్లాదంగా మారనున్నాయి.
సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ): పాస్పోర్టు వెరిఫికేషన్కు వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. జీరో పెండెన్సీతో హైదరాబాద్ పోలీసులు అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకున్న వారు కార్యాలయంలో హాజరవ్వాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. ఆ తరువాత ఆ వివరాలు పోలీసులకు పంపిస్తారు. వెంటనే వారు దరఖాస్తుదారుడు ఉంటున్న చోటకు వెళ్లి సర్టిఫికెట్లు, క్రిమినల్ రికార్డులు ఏమైనా ఉన్నాయా పరిశీలించి.. ఆ నివేదికను తిరిగి పాస్పోర్టు కార్యాలయానికి పంపిస్తారు. ఆ రిపోర్టు ఆధారంగా పాస్పోర్టును జారీ చేస్తారు. గతంలో ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టేది. కానీ ఇప్పుడు గరిష్ఠంగా నాలుగు రోజుల్లోనే అన్ని ప్రక్రియలు పూర్తి చేసి..దరఖాస్తుదారుడికి వేగంగా పాస్పోర్టు అందిస్తున్నారు.
వేగంగా పరిష్కరిస్తూ..
పాస్పోర్టు వెరిఫికేషన్తో పాటు ఇతర దరఖాస్తులను పారదర్శకంగా, వేగంగా పరిష్కరిస్తున్నారు. పాస్పోర్టు వెరిఫికేషన్లో హైదరాబాద్ పోలీసుల ప్రతిభను గుర్తించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అవార్డులను సైతం అందించింది. ఆరేండ్ల నుంచి పాస్పోర్టు వెరిఫికేషన్లో హైదరాబాద్ దేశంలోనే మొదటి వరుసలో ఉంది.