కేపీహెచ్బీ కాలనీ,మే14: అద్దె ఇంట్లో ఉంటున్న ఓ యువకుడు.. ఆ ఇంటి యజమానిపైనే దాడిచేసి కండ్లలో పిండిని చల్లి బంగారు గొలుసు ఎత్తుకెళ్లి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఆదివారం కేపీహెచ్బీ కాలనీ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ డీసీపీ డి.శ్రీనివాస్రావు, సైబరాబాద్ క్రైమ్ ఏసీపీ శశాంక్రెడ్డి, కేపీహెచ్బీ కాలనీ సీఐ కిషన్కుమార్ దొంగతనం వివరాలను వెల్లడించారు. నిజాంపేట రోడ్డులోని ప్రశాంత్నగర్లో సంకబత్తుల మహాలక్ష్మి భర్త, కొడుకుతో కలిసి నివాసముంటుంది. ఆ ఇంట్లో ఓ గదిని ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరుకు చెందిన మల్లా వెంకటేశ్వర్రావుకు అద్దెకు ఇచ్చారు. భర్త, కొడుకు పనిపై బయటకు వెళ్లగా ఆ ఇంటి యజమాని మహాలక్ష్మి మెడపై గొలుసును ఎత్తుకెళ్లాలని వెంకటేశ్వర్రావు నిర్ణయించుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయంలో ఆకస్మాత్తుగా ఇంట్లోకి ప్రవేశించిన వెంకటేశ్వర్రావు మహాలక్ష్మి మెడలోంచి బంగారు గొలుసును లాక్కోగా వృద్ధురాలు ప్రతిఘటించడంతో ఆమె కంట్లో పిండి చల్లి ఆమెపై దాడి చేసి గొలుసును ఎత్తుకెళ్లాడు. విషయాన్ని కొడుకు, భర్తకు తెలుపడంతో వారు కేపీహెచ్బీ కాలనీ పోలీసులను ఆశ్రయించారు.బాలానగర్ సీసీఎస్, కేపీహెచ్బీ కాలనీ పోలీసులు సంయుక్తంగా విచారించి దొంగతనం చేసింది ఆ ఇంట్లో కిరాయికుంటున్న వెంకటేశ్వర్రావుగా నిర్ధ్దారించారు.అతని వద్ద 39.30గ్రాముల (రూ.2.20 లక్షల) విలువైన బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు.