మహేశ్వరం : ఒక వృద్దురాలి మెడలో పుస్తెలతాడు చోరీ చేసి వాహనాల తనిఖీలో పోలీసుల చేతికి చిక్కి కట కటాల పాలైన సంఘటన మహేశ్వరం పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 9న గంగారంలో ఉండె శాంతమ్మ అనే వృద్దురాలు ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు పల్సర్ బండిపై వచ్చి మెడలో ఉన్న బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు.
దీంతో ఆ బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది . ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 12న మహేశ్వరం గేటు సమీపంలో వాహనాలను తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా పల్సర్ వాహనంపై తిరుగుతుండడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి పేర్లు సబావత్ చరణ్కుమార్, ముడావత్ నవీన్ అని తేలింది.
వారిని మరింత లోతుగా విచారించగా గంగారం తండాలో జరిగిన చోరీకి పాల్పడింది తామేనని నేరం ఒప్పుకున్నారని ఆయన అన్నారు. వీరి వద్దనుంచి 65వేలు, పల్సర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇద్దరు దొంగలతోపాటు బంగారు గొలుసును కుదువబెట్టుకున్న షాపు యజమాని రమేష్ను కూడా అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని ఆయన తెలిపారు.