సిటీబ్యూరో, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ): యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహించనున్న సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (అసిస్టెంట్ కమాండెంట్) పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ అదనపు కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్ష సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ, నగరంలో 20 పరీక్షా కేంద్రాలలో 9,039 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్టు ఆయన వివరించారు. ఈ పరీక్ష రెండు సెషన్లలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు, గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని వివరించారు. మాస్క్లు లేని అభ్యర్థులను పరీక్షకు అనుమతించబోమని హెచ్చరించారు. పరీక్ష నిర్వాహకులు, అభ్యర్థులు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని అన్నారు. గంట ముందరే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోరని వివరించారు. పరీక్ష కేంద్రాల వద్ద వెన్యూ సూపర్వైజర్లతో పాటు లోకల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్లు ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో ఇన్స్పెక్షన్ ఆఫీసర్ భగవాన్ దాస్ తదితరులు పాల్గొన్నారు.