సిటీబ్యూరో, జూన్ 16(నమస్తే తెలంగాణ): హెల్మెట్ లేకుండా, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న ఓ యువతి వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీ చేయగా.. 23 చలాన్లు పెండింగ్లో ఉన్నాయని తేలింది.. వివరాల్లోకి వెళ్తే… ఇటీవల సైబరాబాద్ పరిధిలోని కూకట్పల్లిలో ఓ యువతి హెల్మెట్ ధరించకుండా సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుంది… అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఆ యువతి వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా… 23 చలాన్లు ఉన్నాయని బయటపడింది.. అందులో పరిశీలించగా సెల్ఫోన్ డ్రైవింగ్తో పాటు హెల్మెట్ ధరించకుండా వాహనాన్ని నడిపిస్తున్నదని తేలింది.. అయితే .. ‘ప్రమాదం జరగక ముందే మేల్కో అంటూ’ బుధవారం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్లో వాహనదారులను అప్రమత్తం చేస్తూ ఓ పోస్టింగ్ పెట్టారు. వాహనాలను నడిపించే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించి.. సురక్షితంగా ఉండాలని సూచించారు. ఇలా.. సెల్ఫోన్ మాట్లాడుతూ ద్విచక్రవాహనాన్ని నడిపించిన యువతికి, ఆమె తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి.. 23 చలాన్ల రుసుం రూ. 9వేలను కట్టించారు..
మల్కాజిగిరి పరిధిలో బుధవారం రాచకొండ ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు వాహనాలను పరిశీలించగా .. ఒక బైక్(ఏపీ 36 ఏవీ 0181)పై 52, మరో బైక్ (ఏపీ 13 ఏసీ 0754)పై 92 చలాన్లు ఉన్నట్లు గుర్తించారు.. వెంటనే ఆ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.. ఇందులో హెల్మెట్ లేకుండా వాహనం నడపడం…ట్రిపుల్ రైడింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్లు చేసినట్లు ఉన్నాయి. దీంతో 52 చలాన్లకు రూ.17 వేలు చెల్లించి వాహనాన్ని తీసుకెళ్లగా.. 92 చలాన్లు ఉన్న వాహన యజమాని చలాన్ చెల్లించలేదని మల్కాజిగిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుధీర్ కృష్ణ తెలిపారు.