మణికొండ, మార్చి 9: ఎన్నో కష్టనష్టాల మధ్య సామాజిక అవరోధాలను ఎదుర్కొంటూ ముందుకు సాగి చరిత్రలో ప్రముఖంగా నిలిచిన మహిళలు ఎందరో ఉన్నారని వక్తలు పేర్కొన్నారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి స్థాపించిన సుశీలానారాయణరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం నగరంలోని సినారె నిలయం విశ్వంభరలో ఏర్పాటు చేసిన సదస్సులో పలువురు ప్రముఖ మహిళలు పాల్గొని నిన్నటి తరం ప్రతిభా మూర్తులైన నారీమణులకు నీరాజనం పలికారు.
ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా మాట్లాడుతూ.. కర్ణాటక సంగీత విద్వాంసురాలు, నర్తకి బెంగళూరు నాగరత్నమ్మ, హిందుస్థాని సంగీత విద్వాంసురాలు నైనాదేవీలు పట్టుదలతో సంగీత నృత్యాల్లో ప్రావీణ్యం, సంస్కృతం, తెలుగు, కన్నడ, తమిళం వంటి భాషల్లో పాండిత్యం సంపాదించి గొప్ప విదుషీమణులుగా పేరుపొంది ధర్మకార్యాలు చేశారని, అయినప్పటికీ ఎన్నో ఈసండిపులకు గురయ్యారన్నారు.
అయినప్పటికీ గొప్ప విద్వాంసురాలుగా హిందుస్థాని సంగీత రంగానికి విశేషమైన సేవలందించారన్నారు.
ప్రముఖ నర్తకి, నాట్య గురువు డాక్టర్ యశోదా ఠాకూర్ మాట్లాడుతూ.. ఆలయ ఆస్థాన నృత్య కలను సుసంపన్నం చేసిన దేవదాసీలను సమాజం, ప్రభుత్వం అనేక కష్టాలకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. భూమిక సంపాదకురాలు, రచయిత్రి కొండవీటి సత్యవతి మాట్లాడుతూ.. పీపుల్స్ వార్ నాయకుడు కొండపల్లి సీతారామయ్య భార్య కొండపల్లి కోటేశ్వరమ్మ గొప్ప ఉద్యమకారిణిగా, రచయిత్రిగా అన్నింటికి మించి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ కడవరకూ జీవితంతో పోరు సాగించిన వ్యక్తిగా కోటేశ్వరమ్మ చరిత్రలో నిలిచిపోయారన్నారు.
ఆమె రచించిన నిర్జన వారధి పుస్తకం చదివితే భర్త అయిన కొండపల్లి సీతారామయ్య చీకటి కోణాలను తెలుసుకోవచ్చన్నారు. సుశీలానారాయణరెడ్డి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య స్వాగతం పలుకుతూ భారతీయ సమాజానికి వివిధ రంగాల్లో స్వయం కృషితో సేలందించిన ప్రముఖ మహిళల గురించి ఈ తరానికి తెలియజేసేందుకే నారీమణులకు నీరాజనం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి శీలా సుభద్రాదేవి, ట్రస్ట్ అధ్యక్షురాలు సి.గంగ, సినారె కుటుంబ సభ్యులు, ప్రముఖ రచయిత్రులు, రచయితలు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.