సిటీబ్యూరో: టీబీపై సీసీఎంబీ పరిశోధనలు ముమ్మరం చేసింది. వ్యాధి నియంత్రణయే లక్ష్యంగా కొంత కాలంగా టీబీ బ్యాక్టీరియా జీవక్రియలను పరిశోధిస్తున్నారు. మైక్రో బ్యాక్టీరియం ట్యూబరోక్యూలోసిస్ వల్ల ఊపిరితిత్తులు ఏ విధంగా ప్రభావితమవుతున్నాయి..? మానవ రోగ నిరోధకతను ఏ విధంగా తట్టుకుంటున్నాయి..? వంటి విషయాలను తెలుసుకునేందుకు ఈ పరిశోధనలు చేస్తున్నట్లు సీసీఎంబీ వర్గాలు వెల్లడించాయి.
అత్యంత క్లిష్టమైన, అతి సున్నితమైన ఊపిరితిత్తులోని అంతర భాగాలను నిర్వీర్యం చేయడంలో ఈ బ్యాక్టీరియా వేగంగా తమ రూపాన్ని మార్చుకుంటున్నదని, అదే సమయంలో రోగనిరోధకతను తట్టుకునేలా బలోపేతంగా మారుతున్నదని గుర్తించారు. అందుకే తమ పరిశోధనల్లో అత్యంత సంక్లిష్టమైన చికిత్స విధానాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈ పరిశోధనలు కొంత కాలంగా సాగుతున్నాయని, వచ్చే ఏడాదిలో జాతీయస్థాయిలో పరిశోధన బృందం ఆధ్వర్యంలో జరిగే ఈఎంబీవో సమావేశంలో టీబీ నియంత్రణ, అధ్యయన తీరు తెన్నులపై చర్చించనున్నట్లు సీసీఎంబీ వర్గాలు పేర్కొన్నాయి.