హయత్నగర్, జనవరి 5: ఒకపక్క ముమ్మరంగా సాగుతున్న జాతీయ రహదారి విస్తరణ నిర్మాణ పనులు, మరోపక్క మున్సిపల్ అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను అర్ధాంతరంగా నిలిపివేయడంతో స్థానిక కాలనీవాసులు, వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… హయత్నగర్ డివిజన్లోని ఓల్డ్ విలేజ్ నేతాజీనగర్ కాలనీలో సదరు కాంట్రాక్టర్ అర్ధాంతరంగా సీసీ రోడ్డు పనులను వదిలేయడంతో విజయవాడ జాతీయ రహదారి నుంచి నేతాజీనగర్ కాలనీలోకి వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి.
మెయిన్ రోడ్డులో శ్రీరాఘవేంద్ర హోటల్ వద్ద నుంచి యూటర్న్ తీసుకుని రాకపోకలు సాగించాల్సి వస్తుంది. దాంతో నిత్యం అదేరోడ్డు రద్దీగా ఉంటుంది. జాతీయ రహదారి విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతుండటంతో కాలనీలకు వెళ్లే సబ్ రోడ్లన్నీ రద్దీగా మారుతున్నాయి. ముందుగా వెళ్లిన ఏదైన వాహనాన్ని నిలిపితే ఆయా ప్రాంతమంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దాంతో వాహనదారులు అరగంటపాటు ట్రాఫిక్లో ఉండాల్సిన దుస్థితి దాపురించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవచూపి అర్ధాంతరంగా నిలిపిన సీసీరోడ్డును పూర్తి చేయించాలని ప్రజలు కోరుతున్నారు.