బొల్లారం, జూలై 16: నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, వెంటనే మాదిగ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆమె ఇంటిని ముట్టడిస్తామని ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ కంటోన్మెంట్ ఇన్చార్జి ఇటుక శ్రీ కిషన్ మాదిగ హెచ్చరించారు. బుధవారం బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ నేతలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కుల దురహంకార ధోరణితో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని బర్తరఫ్ చేయాలని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వెంటనే మాదిగ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, కూల్చిన ఎమ్మార్పీఎస్ జెండా దిమ్మను తిరిగి అదేచోట పునర్నిర్మించాలని చెప్పారు. అధికార బలంతో అన్యాయంగా ఎమ్మార్పీఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే ఉపసహరించుకోవాలన్నారు.