బంజారాహిల్స్, అక్టోబర్ 25: సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు చెల్లని చెక్కులు ఇచ్చి మోసానికి పాల్పడుతున్న చానల్ చైర్మన్ సహా నలుగురిపై జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 76లో భారత్ టుడే పేరుతో చానల్ నడుస్తున్నది. ఈ చానల్ నిర్వహణను గతంలో బీజేపీ నేత, శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద నడిపించారు. సంస్థ నష్టాల్లో ఉండటంతో ఈ చానల్ను తాను నడిపిస్తానంటూ బీజేపీ రాష్ట్రనేత, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్శదర్శి ధరం గురువారెడ్డి ముందుకు వచ్చారు. జనం ఇన్ఫోటైన్మెంట్, ట్రూ మల్టీ మీడియా సంస్థల పేరుతో ధరం రాధిక. కుప్పిరెడ్డి సింధూర, కూరెళ్ల శోభారాణితో కలిసి ఏడేండ్ల పాటు ఈ చానల్ను నడిపించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి చానల్ను నడిపిస్తున్న గురువారెడ్డి సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.
పలుమార్లు ఉద్యోగులు ఆందోళన చేసినా పట్టించుకోకుండా తనకున్న పలుకుబడితో బెదిరింపులకు దిగడం ప్రారంభించారు. దీంతో జీతాల కోసం ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో పోస్ట్ డేటెడ్ చెక్కులు జారీ చేశారు. అయితే, ఆ చెక్కులు తీసుకుని బ్యాంకులో వేసుకునేందుకు ప్రయత్నించగా.. ఆ చెక్కులకు చెల్లింపులు చేయవద్దంటూ స్టాప్ పేమెంట్ చేయించాడు. దీంతో తమను ఉద్దేశపూర్వకంగానే మోసం చేసేందుకు గురువారెడ్డితో పాటు ఇతర డైరెక్టర్లు చెల్లని చెక్కులు ఇచ్చారంటూ ఆ సంస్థ ఉద్యోగులు చలపతిరావు తదితరులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులపై ఐపీసీ 406, 420 రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.